AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. 6 నెలల్లో డబ్బు తిరిగిచ్చేలా ఏపీ సర్కార్ రూట్ మ్యాప్..

దాదాపు పదేళ్లుగా నలిగిపోతున్న అగ్రిగోల్డ్ బాధితుల గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి తమ సొంత సొమ్ము కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది డిపాజిటర్లకు కూటమి ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. వచ్చే ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితుల అకౌంట్లలో డబ్బులు వేసేలా అత్యంత వేగంగా కార్యాచరణ సిద్ధం చేసింది.

Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. 6 నెలల్లో డబ్బు తిరిగిచ్చేలా ఏపీ సర్కార్ రూట్ మ్యాప్..
Ap Cabinet Sub Committee On Agrigold Issue
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 11:49 AM

Share

దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, వచ్చే ఆరు నెలల్లో ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది. సచివాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, వర్చువల్‌గా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత పరిస్థితి, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్‌లు, న్యాయపరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ప్రత్యేక కోర్టుతో వేగంగా పరిష్కారం

అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను త్వరితగతిన వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు చెల్లించేలా ప్రభుత్వం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిందన్నారు. న్యాయపరమైన ప్రతి అంశాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

జియో ట్యాగింగ్‌తో ఆస్తుల రక్షణ

అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూములను జియో ట్యాగింగ్ చేసి, వాటి రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని నిర్ణయించింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 23,599 ఎకరాల భూములను గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆస్తులన్నింటినీ కోర్టు అనుమతులతో వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది.

రూ.3,944 కోట్ల చెల్లింపుల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లకు రూ.3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. అలాగే సీఐడీ దర్యాప్తులో సుమారు రూ.2,000 కోట్ల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉన్నట్లు గుర్తించామని, వాటిని 30 రోజుల్లో స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

ప్రతి 15 రోజులకు సమీక్ష

అగ్రిగోల్డ్ సమస్యను నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కేసుల పురోగతి, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్‌లు, కోర్టు వ్యవహారాలపై నిరంతరం సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను సరిగా పరిరక్షించలేదని, భూముల వివరాలు, సర్వే నంబర్ల గుర్తింపు ప్రక్రియను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సీఐడీ వద్ద ఉన్న కొన్ని హార్డ్‌డిస్కులు కూడా కనిపించకుండా పోయాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సమస్య మరింత జటిలమైందని, ఇప్పుడు అన్ని శాఖల సమన్వయంతో పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు.

బాధితుల్లో కొత్త ఆశలు

ఏళ్ల తరబడి తమ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు తాజా ప్రకటన కొత్త ఆశలు కలిగిస్తోంది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆరు నెలల గడువు, జియో ట్యాగింగ్, ఆస్తుల వేలం, ప్రతి 15 రోజులకు సమీక్ష వంటి నిర్ణయాలతో ప్రభుత్వం ఈసారి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది.

Follow Us