Food Crisis: అన్నమో రామచంద్రా..! ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కష్టాలు.. భవిష్యత్తు పరిస్థితి ఏమిటంటే..
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి బాధలు ఎక్కువ అవుతున్నాయి. భవిష్యత్తుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుదన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది తిండి కోసం అలమటిస్తుండగా..
Food Crisis: ప్రపంచ వ్యాప్తంగా ఆకలి బాధలు ఎక్కువ అవుతున్నాయి. భవిష్యత్తుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుదన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది తిండి కోసం అలమటిస్తుండగా.. కరవుతో జనం కొట్టిమిట్టాడుతున్నారు. ప్రపంచంలో ఆకలి కేకలపై ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్- WFP తాజాగా ఓ నివేదిక విడుదల చేసింంది. దీని ప్రకారం విశ్వ వ్యాప్తంగా 8 కోట్ల 28 లక్షల మంది ప్రజలు ఆకలితోనే నిద్ర పోతున్నారు.. 45 దేశాలల్లోని 50 లక్షల మంది జనం కరువుతో కొట్టు మిట్టాడుతున్నారు. ఇళ్లూ, వస్త్రాలు లేకున్నా జీవించడానికి ఆహారం అత్యంత అవసరం. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జనం ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు.
ఆహార కొరతను ఎదుర్కొంటున్న జనాభా గత మూడేళ్లతో పోలిస్తే 50 శాతం పెరిగి సుమారు 345 మిలియన్లకు చేరుకుంది.. గత మూడేళ్లుగా ఈ సమస్య మరింత తీవ్రగా మారిపోయిందని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక చెబుతోంది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతల కారణంగా ఈ సమస్య ఏర్పడిందని పేర్కొంది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధం సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అమెరికాతో పాటు యూరోప్ దేశాలు రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా పలు దేశాలకు గోధుమలు, బియ్యం సరఫరా నిలిచిపోయింది.
కరోనా మహమ్మారికి ముందు ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 35 లక్షల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటే, ఈ సంఖ్య ఇప్పుడు ఎన్నోరెట్లు పెరిగిపోయింది.. ప్రతి రాత్రి 8 కోట్ల 28 లక్షల మంది ప్రజలు ఆకలితోనే నిద్రలోకి జారుకొని రోజును ముగిస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లోని 50 లక్షల మంది ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నారు. అనేక దేశాల్లో ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని WFP అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు రోజు రోజుకీ మరింతగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్-నార్త్ ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 2022 చివరి నాటికి మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 2023లో కూడా ఈఆకలి కేకల సమస్య మరింత ఘోరంగా ఉండొచ్చని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..