ఇరాన్లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ రంగం సిద్ధమా..?
ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా పెద్ద నిర్ణయం తీసుకోబోతోందా…? దాడులకు 10 రోజుల విరామం అని ట్రంప్ ప్రకటించిన తర్వాత, పశ్చిమాసియాలో అకస్మాత్తుగా సీన్ మారింది. అగ్రరాజ్య సైనిక మోహరింపులు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు, సెయిలర్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇరాన్తో యుద్ధం శుక్రవారం (మార్చి 27, 2026) నాటికి ఒక నెల పూర్తి చేసుకుంటున్న తరుణంలో, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత పెంచింది. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు, సెయిలర్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్లోకి భూతల దళాలను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందా అనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది.
ఈ కొత్త మోహరింపుతో, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అమెరికా ఇప్పటికే ఆ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచుకుంది. దీంతో గత 20 ఏళ్లలో ఇదే అతిపెద్ద సైనిక సమీకరణగా నిలిచింది. USS ట్రిపోలి మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరుకుందని సెంట్రల్ కమాండ్ (CENTCOM) X అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రకటించింది. “USS ట్రిపోలిలో మోహరించిన మెరైన్లు, సెయిలర్స్ యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతానికి చేరుకున్నారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యూఎస్ఎస్ ట్రిపోలిలో రవాణా, దాడి కోసం ఉపయోగించే వివిధ రకాల విమానాలు, యుద్ధ సామగ్రి ఉన్నాయి. సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసిన ఫోటోలలో, పూర్తి యుద్ధ దుస్తులలో ఉన్న మెరైన్లతో పాటు, సీహాక్ హెలికాప్టర్లు, ఆస్ప్రే రవాణా విమానాలు, ఎఫ్-35 యుద్ధ విమానాలు నౌకపై మోహరించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. యూఎస్ఎస్ ట్రిపోలి, 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ సాధారణంగా జపాన్లో మోహరించి ఉంటాయి. ఈ యూనిట్ తైవాన్ సమీపంలో విన్యాసాలు నిర్వహిస్తుండగా, తరువాత దానిని మధ్యప్రాచ్యానికి మళ్లించారు. మెరైన్లు రాకముందే, అమెరికా ఆ ప్రాంతంలో రెండు విమాన వాహక నౌకలు, అనేక యుద్ధ నౌకలు, వేలాది మంది సైనికులను మోహరించింది. గత రెండు దశాబ్దాలలో ఇదే అతిపెద్ద సైనిక మోహరింపుగా భావిస్తున్నారు. AP కథనం ప్రకారం, అమెరికా సరికొత్త విమాన వాహక నౌక అయిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్, మరమ్మతులు, సరఫరాల కోసం ఇటీవల మధ్యప్రాచ్యం నుండి యూరప్కు బయలుదేరింది. నౌకలోని లాండ్రీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం దానిలోని కొన్ని గదులు ప్రమాదానికి గురయ్యాయి.
అమెరికా ఉన్నతాధికారులు బహిరంగంగా భూతల దాడి అవకాశాన్ని తక్కువ చేసి చూపుతున్నప్పటికీ, సైనిక సన్నాహాలు ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. మరోవైపు, ఇరాన్పై కొనసాగుతున్న ఆపరేషన్ త్వరలో ముగియవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఫ్రాన్స్లో జీ7 దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమైన అనంతరం, ఇది “నెలల్లో కాదు, వారాల్లోనే” పూర్తి కావచ్చని ఆయన అన్నారు. భూతల దళాలను పంపకుండానే అమెరికా తన లక్ష్యాలను సాధించగలదని, అయితే అవసరమైతే ప్రత్యామ్నాయాలను తెరిచి ఉంచడానికి కొన్ని సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
అమెరికా బలగాలు ఇరాన్ సమీపంలో మోహరించవచ్చ ని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొన్నారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపం చుట్టుపక్కల ప్రాంతంతో సహా, ఇరాన్ సమీపంలో అమెరికా బలగాలు మోహరించవచ్చని తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రాంతానికి కనీసం 10,000 మంది అదనపు సైనికులను పంపాలని ఆయన యోచిస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
U.S. Sailors and Marines aboard USS Tripoli (LHA 7) arrived in the U.S. Central Command area of responsibility, March 27. The America-class amphibious assault ship serves as the flagship for the Tripoli Amphibious Ready Group / 31st Marine Expeditionary Unit composed of about… pic.twitter.com/JFWiPBbkd2
— U.S. Central Command (@CENTCOM) March 28, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
