ఆ దేశంలో ఏప్రిల్ తర్వాత తొలి కరోనా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. అయితే కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత కొన్ని దేశాలు .....
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. అయితే కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత కొన్ని దేశాలు మాత్రం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. కరోనా కట్టడికి చర్యలు చేపట్టి కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అలాంటి దేశాల్లో తైవాన్ ఒకటి. మొదట్లో కోవిడ్ను అడ్డుకునేందుకు తైవాన్ తీసుకున్న చర్యలతో ఈ వైరస్ను నియింత్రణలోకి వచ్చింది. 250 రోజుల పాటు అక్కడ స్థానికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లల్లోనే కొన్ని కేసులు వచ్చాయి. అయితే తాజాగా ఏప్రిల్ 12వ తేదీ తర్వాత మళ్లీ మంగళవారం ఒక కరోనా కేసు నమోదైంది. న్యూజిలాండ్కు చెందిన పైలట్ స్నేహితురాలికి కోవిడ్ సోకినట్లు గుర్తించారు అధికారులు.
దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న మరో వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం న్యూజిలాండ్ పైలట్కు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. అతనితో సన్నిహితంగా ఉన్న కారణంగా 30 ఏళ్ల మహిళకు కూడా వైరస్ సోకినట్లు తైవాన్ ఆరోగ్యశాఖ మంత్రి చెన్ షిహ్-చుంగ్ వెల్లడించారు. సదరు పైలట్ తైవాన్లో తిరిగిన ప్రదేశాలను సైతం ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
స్థానికంగా నమోదైన కేసుతో సంబంధం ఉన్న 167 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, తైవాన్లో ఇప్పటి వరకు 771 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో చాలా వరకు విదేశాల నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. ప్రస్తుతం 130 మంది కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.