AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి బాంబుగా మారిన హిమాపాతం.. భారీ వరదలకు నేపాల్‌ వినాశనం.. అండగా నిలిచిన భారత్!

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు పెను వినాశనం సృష్టించాయి. భోటేకోశి నది ఉప్పొంగడంతో రసువా జిల్లా సహా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 160కి పైగా మరణాలు, వందలాది మంది గల్లంతయ్యారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. కైలాష్-మానసరోవర్ యాత్రికులతో సహా పలువురు భారతీయులు చిక్కుకున్నారు. ప్రధాని మోడీ హామీతో భారత్ తక్షణమే 8 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని పంపించి, మానవతా దృక్పథంతో అండగా నిలిచింది.

నీటి బాంబుగా మారిన హిమాపాతం.. భారీ వరదలకు నేపాల్‌ వినాశనం.. అండగా నిలిచిన భారత్!
Nepal Flash Flood
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 8:28 AM

Share

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భోటేకోశి నది ఉప్పొంగడంతో రసువా జిల్లాతో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ మౌలిక వసతులు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రకారం మృతుల సంఖ్య 160కి పైగా చేరగా, వందలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ విపత్తులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, యాత్రికుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కైలాష్-మానసరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయులు, ప్రవాస భారతీయులు కూడా గల్లంతైనట్లు సమాచారం. అయితే వరదల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

తమిళనాడుకు చెందిన పర్యాటకులలో పలువురి ఆచూకీ తెలియడం లేదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కైలాష్-మానసరోవర్ యాత్రికుల బృందంలోని కొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఈ విపత్తులో చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల పౌరుల ఆచూకీ కోసం ఆయా ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ విపత్తుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్‌లో మాట్లాడారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని.. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌కు సాధ్యమైన అన్ని రకాల మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో నేపాల్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

భారత్ ఇప్పటికే మందులు, అత్యవసర సామగ్రి, ఇతర సహాయక వస్తువులను నేపాల్‌కు పంపించింది. సుమారు 8 టన్నుల సహాయ సామగ్రిని ట్రక్కుల ద్వారా ప్రభావిత ప్రాంతాలకు తరలించింది. దుప్పట్లు, సోలార్ లైట్లు, సోలార్ ప్యానెళ్లు, దోమతెరలు, స్లీపింగ్ బ్యాగులు వంటి అత్యవసర వస్తువులు ఇందులో ఉన్నాయి. మరోవైపు, భారత పౌరుల కోసం కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. నేపాల్‌లో ఉన్న భారతీయులు లేదా వారి కుటుంబ సభ్యులు +977 985 131 6807, +977 970 910 7500 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. చైనాలోని భారత రాయబార కార్యాలయం కూడా మానసరోవర్ యాత్రికుల కోసం ప్రత్యేక సంప్రదింపు నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అయితే, వరదలకు ముందు భూకంపం సంభవించిందా, లేక కొండచరియలు విరిగిపడటం వల్ల భారీ నీటి ప్రవాహం ఏర్పడిందా అనే అంశంపై కూడా అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల భోటేకోశి నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం నేపాల్‌లో సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us