AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒమాన్ తీరంలో మరో నౌకపై దాడి.. భారతీయ నావికుల భద్రతపై ఆందోళన

ఒమాన్ తీర ప్రాంతంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న ఎంటీ జల్వీర్ వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. షినాస్ నౌకాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం, గాయాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయులు ఉన్న నౌకలపై జరిగిన మూడో దాడి ఇదే కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఒమాన్ తీరంలో మరో నౌకపై దాడి.. భారతీయ నావికుల భద్రతపై ఆందోళన
Oman Coast Attack
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2026 | 1:14 PM

Share

ఒమాన్ తీర ప్రాంతంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఇటీవల హోర్ముజ్ జలసంధి సమీపంలో వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎంటీ జల్వీర్‌గా గుర్తించిన ఈ నౌక ఒమాన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీపంలో దాడికి గురైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా, నౌకకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

గత మూడు రోజుల వ్యవధిలో ఒమాన్ తీర ప్రాంతంలో భారతీయులు ఉన్న నౌకలపై జరిగిన మూడో దాడి ఇదే కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు మరింత పెరిగాయి.

ఈ ఘటనపై ఒమాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది. నౌకలో ఉన్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది.

కాగా, ఈ ఘటనకు ఒక రోజు ముందు గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లోని సెట్టెబెల్లో అనే ట్యాంకర్‌పై జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు దౌత్యపరంగా స్పందించింది.

వరుసగా భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలు లక్ష్యంగా మారుతుండటంతో సముద్ర మార్గ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Follow Us