AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిజ్బుల్లా నేతలను బాంబులు, బుల్లెట్లతో కాకుండా చాలా తెలివిగా చంపిన ఇజ్రాయెల్..!

ఉగ్రవాదుల అంతానికి ఇజ్రాయెల్ కొత్త టెక్నాలజీని అవలంబించింది. హషీమ్ సఫీయుద్దీన్ మరణం తర్వాత కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

హిజ్బుల్లా నేతలను బాంబులు, బుల్లెట్లతో కాకుండా చాలా తెలివిగా చంపిన ఇజ్రాయెల్..!
Middle East Crisis
Balaraju Goud
|

Updated on: Oct 24, 2024 | 4:13 PM

Share

గత ఏడాది కాలంగా గాజా స్ట్రిప్‌లో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని హిజ్బుల్లా నేతలను హతమార్చేందుకు సరికొత్త టెక్నిక్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. హిజ్బుల్లా సురక్షితం అని భావించిన రెండు ప్రదేశాలలో IDF మెరుపు దాడి చేసి విజయం సాధించింది. ఇజ్రాయెల్ డిఫిన్స్ ఫోర్స్ నుండి తప్పించుకోవడానికి నిర్మించిన సొరంగాలలో ఉగ్రవాదులు తమను తాము సురక్షితంగా భావించారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దానికి కూడా ఒక పరిష్కారాన్ని కనుగొంది. మొదట, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, ఆ తర్వాత అతని వారసుడు హషీమ్ సఫీయుద్దీన్‌లను ఇజ్రాయెల్ ఇదే పద్ధతిలో చంపింది.

ఇజ్రాయెల్ సెప్టెంబర్ 27న హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాను హతమార్చింది, ఆ తర్వాత అక్టోబర్ 10వ తేదీన బీరూట్‌లోని దక్షిణ శివార్లలోని అల్-మరిజా ప్రాంతంలో వైమానిక దాడి చేసి, హిజ్బుల్లా కౌన్సిల్ అధిపతి హషీమ్ సఫీయుద్దీన్‌ను హతమార్చింది. టెల్ అవీవ్ రెండు రోజుల క్రితం అతని మరణాన్ని ప్రకటించినప్పటికీ, హిజ్బుల్లా బుధవారం అధికారికంగా వార్తలను ధృవీకరించింది.

ఉగ్రవాదుల అంతానికి ఇజ్రాయెల్ కొత్త టెక్నాలజీని అవలంబించింది. హషీమ్ సఫీయుద్దీన్ మరణం గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ చేసిన ప్రత్యక్ష వైమానిక దాడులలో సఫీయుద్దీన్ చనిపోలేదని, అతను అల్-మజీరాలోని భవనం కింద ఉన్న సొరంగంలో ఉన్నాడని పేర్కొంది. IDF జరిపిన బాంబు దాడిలో భవనం కుప్పకూలింది. ఆ సమయంలో అతనితో పాటు శిక్షణ పొందిన 7 మంది సాయుధ వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఈ దాడి తర్వాత సఫీయుద్దీన్ మూడు రోజుల పాటు సజీవంగా ఉన్నాడని, అయితే ఆ తర్వాత అతను, హిజ్బుల్లాకు చెందిన మరో ఏడుగురు శిక్షణ పొందిన సాయుధ సభ్యులు ఊపిరాడక మరణించారని వర్గాలు తెలిపాయి.

హిజ్బుల్లా తన అన్ని భూగర్భ ఆశ్రయాల్లో ఆక్సిజన్‌ను నిల్వ చేసింది. అవి భూమికి చాలా దిగువన ఉన్నందున, ఇక్కడ ఆక్సిజన్ అందకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసింది. టువంటి పరిస్థితిలో, ఇక్కడ ఉన్న ప్రజలను సజీవంగా ఉంచడానికి, ఈ లోపాన్ని కృత్రిమ ఆక్సిజన్‌తో నింపారు. దాడి తర్వాత, ఈ ఇజ్రాయెల్ దళం ఆ స్థలంపై నిఘా ఉంచింది. హిజ్బుల్లాకు చెందిన ఏ అత్యవసర బృందాన్ని అక్కడికి చేరుకోవడానికి అనుమతించలేదు. ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా హషీమ్ సఫీయుద్దీన్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని హిజ్బుల్లా అధికారి ధృవీకరించారు. హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకున్న అండర్‌గ్రౌండ్ హెడ్‌క్వార్టర్స్‌ను చేరుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ప్రతిసారీ ఇజ్రాయెల్ రెస్క్యూ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తిరిగి వచ్చింది. దీని కారణంగా, భవనం కూలిపోవడంతో భూమి కింద సమాధి అయిన హషీమ్ సఫీయుద్దీన్, అతని సహచరులను రక్షించలేకపోయారు.

ఇక హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ ఇదే పద్ధతిలో చంపింది. ఎందుకంటే అతని మృతదేహాన్ని కనుగొన్న పారామెడిక్స్‌లో ఒకరు అతను ఊపిరాడక చనిపోయారని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. గత సెప్టెంబరు నుండి, ఇజ్రాయెల్ లెబనాన్‌లోని వివిధ ప్రాంతాలపై, ముఖ్యంగా బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతాలపై (ఉగ్రవాదులకు బలమైన కోట), అలాగే దక్షిణ, బెకా (తూర్పు)పై దాడులను తీవ్రతరం చేసింది.

ఇజ్రాయెల్ అనేక హత్యలు చేయడం ద్వారా హిజ్బుల్లాకు పెద్ద దెబ్బ తగిలింది. వాటిలో ముఖ్యమైనది నస్రల్లా హత్య. ఇది కాకుండా, పార్టీ దక్షిణ ఫ్రంట్ నాయకుడు అలీ కరాకి సెప్టెంబర్ 23న లక్ష్యంగా చేసుకున్నారు. IDF జూలై 30న జరిగిన లక్ష్య దాడిలో హిజ్బుల్లా వ్యవస్థాపక తరంలో ఒకరిగా, దాని ప్రముఖ సైనిక నాయకులలో ఒకరిగా భావించే ఫౌద్ షుక్ర్‌ను కూడా చంపింది.

హషీమ్ సఫీయుద్దీన్ హిజ్బుల్లాలో మొదటి ర్యాంక్ నాయకుడు.ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి. అతను నస్రల్లా బంధువు. అంతేకాదు అతని కంటే చాలా తీవ్రమైనవాడు. అతను హిజ్బుల్లా, ఇరాన్ మధ్య ఒక ముఖ్యమైన లింక్ కూడా. ఎందుకంటే అతని కుమారుడు రెజా మాజీ రివల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాసిం సులేమానీ కుమార్తె జైనాబ్‌ను వివాహం చేసుకున్నాడు. అతని సోదరుడు అబ్దుల్లా విషయానికి వస్తే, అతను టెహ్రాన్‌లో హిజ్బుల్లా ప్రతినిధి. 2017 ప్రారంభంలో, వాషింగ్టన్ హషీమ్‌ను ఉగ్రవాద జాబితాలో చేర్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us