AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత గాల్లో దీపమేనా..? అసలు కారణమేంటి..?

భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. అక్కడ హిందువులే టార్గెట్‌గా ఎటాక్‌ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆలయాలే టార్గెట్‌గా అల్లరిమూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్‌ సైరన్ మోగింది. భద్రతపై బంగ్లాదేశ్‌ హామీ ఇస్తున్నా.. హిందువుల్లో మాత్రం భయం తగ్గలేదు.

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత గాల్లో దీపమేనా..? అసలు కారణమేంటి..?
Bangladesh Hindus
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2025 | 3:48 AM

భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. అక్కడ హిందువులే టార్గెట్‌గా ఎటాక్‌ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆలయాలే టార్గెట్‌గా అల్లరిమూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్‌ సైరన్ మోగింది. భద్రతపై బంగ్లాదేశ్‌ హామీ ఇస్తున్నా.. హిందువుల్లో మాత్రం భయం తగ్గలేదు. కారణమేంటి..? అసలు బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత గాల్లో దీపమేనా..? తెలుసుకుందాం.

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. హిందూ ఆలయాలు, కాలనీల వద్ద పోలీసు బలగాలను మోహరించింది. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం గత కొంతకాలంగా ఆందోళనలో ఉంది. ఇటీవల చిట్టగాంగ్‌లో మూడు ఆలయాలపై దాడులు జరిగాయి. శాంతనేశ్వరి మాతృ ఆలయం, సోనీ ఆలయం, శాంతనేశ్వరి కాళీబరి ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలు హిందూ సమాజంలో భయాందోళనలను పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భద్రతా చర్యలను కఠినతరం చేసింది.

భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది. పాకిస్తాన్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు జరిపింది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌లోనూ ప్రభావం చూపుతున్నాయి. హిందూ సమాజంపై దాడులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢాకా పోలీసు హెడ్‌క్వార్టర్స్ నుంచి అన్ని స్టేషన్‌లకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. హిందువుల భద్రత, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆలయాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. హిందూ కాలనీల్లో రాత్రివేళల్లో గస్తీని పెంచారు.

బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం దాదాపు 8 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. ఆలయాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు. ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగిన కొన్ని స్థానిక సంస్థలు హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందువులపై దాడులు పెరిగాయి. ఆమె ప్రభుత్వం హిందూ సమాజానికి అనుకూలంగా ఉందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. ఆమె పతనం తర్వాత కొన్ని మతోన్మాద గుండాలు హిందూ కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ దాడులను అడ్డుకోవడంలో అప్పటి తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ తప్పిదాలను సవరించే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా భారత్ నుంచి వస్తున్న ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది.

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ ఐక్య వేదిక ఈ చర్యలను స్వాగతించింది. అయితే, దీర్ఘకాలిక భద్రతా పథకం అవసరమని పేర్కొంది. గతంలో జరిగిన దాడులపై నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించకపోతే స్థానికంగా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. హిందూ సంఘాలు ఈ చర్యల అమలును దగ్గరగా పరిశీలిస్తున్నాయి. అయితే ప్రభుత్వ చర్యలు ఎంతవరకు పటిష్టంగా అమలవుతాయన్నది కీలక ప్రశ్న. గతంలో ఇలాంటి ప్రకటనలు వచ్చినా హిందువులపై దాడులు ఆగలేదు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ కుటుంబాలు ఆందోళనలోనే ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..