మనిషి ప్రాణం ఖరీదు ఎంత..? అమెరికా లెక్కలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీకి ఇస్తున్న ప్రాధాన్యత ముందు మానవ జీవితం చిన్నబోతోందా? మనిషి సృష్టించిన వస్తువుల ధర కోట్లలో ఉంటే, ఆ మనిషి ప్రాణానికి కట్టిన వెల మాత్రం అత్యల్పంగా కనిపిస్తోంది. ఒక్క ఫార్ములా వన్ కారు విలువే ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మనిషి ప్రాణానికి వెల కట్టగలమా? ఈ ప్రశ్నకు ఎవరైనా లేదు అనే సమాధానం చెబుతారు. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం మనిషి ప్రాణానికి అధికారికంగా ఒక విలువను నిర్ధారించింది. ఒక మనిషి ప్రాణం విలువను ఏకంగా 13.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.114 కోట్లు) లెక్కకట్టింది. వినడానికి ఇది చాలా వింతగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. భద్రతకు సంబంధించిన విశ్లేషణలు, అలాగే వ్యయ ప్రయోజన విశ్లేషణల కోసం అధికారులు ఈ గణాంకాలను ఉపయోగిస్తారు. ఏదైనా ప్రాజెక్టు లేదా భద్రతా విధానాన్ని అమలు చేసేటప్పుడు, దాని వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడబడతాయి, దానికి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా కోసం ఈ విలువను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన యంత్రాలు, వ్యవస్థలు, ప్రాజెక్టులతో మనిషి ప్రాణం విలువను పోల్చినప్పుడు ఈ లెక్కలు చాలా ఆందోళనకరంగా కనిపిస్తాయి. మనిషి సృష్టించిన వస్తువుల ఖర్చు ముందు మనిషి ప్రాణం విలువ అత్యంత తక్కువగా కనిపిస్తుంది. యంత్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ముందు మానవ జీవితం చిన్నబోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు.. అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఒక బి-2 స్టీల్త్ బాంబర్ విమానం ఖర్చు సుమారు 2.1 బిలియన్ డాలర్లు. అంటే అమెరికా ప్రభుత్వం లెక్కించిన మానవ ప్రాణం విలువతో పోల్చుకుంటే, ఒకే ఒక యుద్ధ విమానం ఖర్చు ఏకంగా 155 మంది ప్రాణాలతో సమానం అన్నమాట. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం యుద్ధ విమానాలే కాదు, క్రీడల్లో ఉపయోగించే వాహనాల ఖర్చు కూడా మనిషి ప్రాణం కన్నా ఎక్కువే కావడం గమనార్హం. అత్యంత వేగంగా దూసుకుపోయే ఒక ఫార్ములా 1 రేసింగ్ కారును తయారు చేయడానికి సుమారు 16 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వం అధికారికంగా కట్టిన ఒక మనిషి ప్రాణం విలువ కంటే ఒక రేసింగ్ కారు విలువే ఎక్కువ. ఇక సాంకేతిక వ్యవస్థలు, అంతరిక్ష పరిశోధనల విషయానికి వస్తే ఈ వ్యత్యాసం మరీ దారుణంగా ఉంటుంది. ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ ఏడబ్ల్యూఎస్ సర్వర్ కేవలం ఒక్క నిమిషం పాటు నిలిచిపోతే సుమారు 9,000 డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టు కోసం ఏకంగా 150 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే.. ఇది 10,900 మందికి పైగా వ్యక్తుల ప్రాణాలతో సమానం.
మనుషుల కంటే యంత్రాలే ముఖ్యం అని ఏ ప్రభుత్వమూ లేదా సంస్థా అధికారికంగా చెప్పకపోవచ్చు. కానీ మనం పెడుతున్న ఖర్చులు, వెచ్చిస్తున్న నిధులను గమనిస్తే మాత్రం లెక్కలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనిషి ప్రాణం కంటే సాంకేతికత, ఆయుధాలు, విలాసాలకే ప్రపంచం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి. మనిషి సృష్టించిన యంత్రాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ఆధునిక సమాజం, సామాన్యుడి భద్రత, ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాణానికి వెల కట్టడం పక్కనపెడితే, ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు వ్యవస్థలు మరింత పటిష్ఠంగా పనిచేయాల్సిన తరుణం ఇది. ఆలోచించండి, నిజంగా మనిషి ప్రాణం కంటే ఒక యంత్రం విలువైందా?
