‘మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం’.. ఓ జంట విచిత్ర పెళ్లి వేడుక
ఇటీవల ఈక్వడార్లో 'పెట్ ఫ్రెండ్లీ' వివాహాలకు అనుమతి లభించడంతో, పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావించే జంటలు వాటి సమక్షంలో వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి 50కి పైగా జంటలు తమ కుక్కలు, పిల్లుల ఎదుటే వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. తాజాగా మరో జంట తమ పెంపుడు కుక్క పిల్లను పెళ్లి పెద్దగా పెట్టుకుని వివాహం చేసుకున్నారు. ఈ విచిత్ర పెళ్లి నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

క్విటో (ఈక్వడార్), జులై 13: వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా బంధువుల సాక్షిగా మూడు ముళ్లు, ఏడడుగులు వేయడం షరా మామూలే. అయితే ఓ జంట మాత్రం తమ బంధానికి సాక్షిగా పెంపుడు కుక్కను పెళ్లిలో పెద్ద మనిషిగా పెట్టుకుంది. తమ వివాహానికి సాక్షిగా కుక్క పిల్లను తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వినూత్న సంఘటన ఈక్వడార్లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
డయానా టుపిజా, ఆండ్రెస్ అల్కింగా అనే జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు వారు తమ పెంపుడు పీకినీస్ జాతికి చెందిన కుక్క ‘లూనా’ను సాక్షిగా ఎంపిక చేసుకున్నారు. వివాహ ధ్రువపత్రంపై లూనా తన పంజా ముద్రను వేయడం ద్వారా వేడుకలో భాగమైంది. ఇటీవల ఈక్వడార్ అధికారులు ‘పెట్ ఫ్రెండ్లీ’ వివాహాలకు అనుమతి ఇవ్వడంతో పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావించే జంటలు ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. చట్టపరంగా లూనా పంజా ముద్రకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోయినా, ఆ జంటకు అది భావోద్వేగపూరితమైన జ్ఞాపకంగా నిలిచింది.
వివాహం అనంతరం డయానా మాట్లాడుతూ.. ‘లూనా మా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఆమె మా పెళ్లిలో ఉండటం చాలా ఆనందంగా, ప్రత్యేకంగా అనిపించింది’ అని తెలిపారు. ఈ ఆలోచన తన భర్తదేనని కూడా ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా లూనా గులాబీ రంగు ట్యూల్ గౌన్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకకు హాజరైన అతిథులు కూడా లూనాతో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈక్వడార్లో మే నెల నుంచి ఇప్పటివరకు 50కి పైగా జంటలు తమ పెంపుడు కుక్కలు లేదా పిల్లుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబాల్లో పెంపుడు జంతువుల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా వివాహాలు కొత్త ట్రెండ్గా మారుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
