Bangla Tension: బంగ్లాదేశ్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. ఈసారి దేశ అధ్యక్షుడికి గురి పెట్టిన విద్యార్థి సంఘాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏ తప్పు చేయలేదంటూ అధ్యక్షుడు షహబుద్దీన్ ఆమెకు క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకారులు ఆరోపించారు.
బంగ్లాదేశ్లో విద్యార్ధులు మరోసారి రోడ్డెక్కారు. అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను కాపాడేందుకు షాబుద్దీన్ ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.
బంగ్లాదేశ్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢాకాలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు దేశ అధ్యక్షుడు షాబుద్దీన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. షాబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. తాజా ఆందోళనలతో అధ్యక్ష భవనం ముందు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
షేక్ హసీనా ఏ తప్పు చేయలేదంటూ అధ్యక్షుడు ఆమెకు క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడి భవనం బంగాబభన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగింది.
అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా లేఖ దొరకలేదని వ్యాఖ్యానించడంపై విద్యార్ధులు భగ్గుమంటున్నారు. అంతేకాకుండా ఆ రాజీనామా లెటర్ను వెతికేందుకు ప్రయత్నించినా అది దొరకలేదని అనడం వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం.. బంగ్లాదేశ్ విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ఆగస్ట్ 5వ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి భారత్కు వచ్చి ఆశ్రయం పొందిన రోజు రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ షహబుద్దీన్.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి లేఖను తనకు అందించారని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..