పాక్ను ఇండియా భయపెడుతుంటే.. BLA వణికిస్తోంది? అసలు ఎవరీ బలూచ్ ఫైటర్లు? పాక్తో వాళ్లకు వైరమేంటి? పూర్తి చరిత్ర
బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులు పాకిస్తాన్కు తీవ్ర ముప్పుగా మారాయి. పాకిస్తాన్ సైన్యంపై వరుస దాడులు చేస్తూ, పట్టణాలను స్వాధీనం చేసుకుంటోంది బీఎల్ఏ. బలూచిస్తాన్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న బీఎల్ఏ, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ విరుచుకుపడుతుందేమో భయంలో ఉన్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అల్లాడిపోతోంది. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బీఎల్ఏ(బలూచ్ లిబరేషన్ ఆర్మీ) లేటెస్టుగా బలూచిస్తాన్లో ఓ టౌన్ని కూడా స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. తాజా దాడిలో పాక్ సైనికులను బంధించి మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుందని సమాచారం. బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. సొంత దేశంలో నిరసనకారుల నుంచి ఓ పట్టణాన్ని కాపాడుకోలేక పోయిన పాక్.. భారత్పై మాత్రం దాడులకు వెనుకాడబోం అంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. పాకిస్తాన్కు తలబొప్పి కట్టిస్తున్న ఈ బలూచిస్తాన్ ప్రాంతం గురించిన వివరాలు చూద్దాం.
పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్లో అతి పెద్ద ప్రావిన్స్గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.
అలాగే ఆ ప్రావిన్స్లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం, అమెరికా బీఎల్ఏను ఒక ఉగ్ర సంస్థగా గుర్తించాయి. ప్రస్తుతం పాక్, ఇండియాతో యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్న క్రమంలో బీఎల్ఏ.. పాకిస్థాన్తో పాటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. వెంటనే బలూచిస్తాన్ను వదిలివెళ్లిపోవాలంటూ ఆ రెండు దేశాలను హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
