ఓరీ దేవుడో.. తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన రెండు భారీ పాములు భక్తులను భయాందోళనలకు గురిచేశాయి. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. సుమారు 8 అడుగులు మరియు 6 అడుగుల పొడవు ఉన్న ఈ రెండు పాములు రోడ్డుపై సంచరిస్తూ భక్తుల కంటపడ్డాయి. గోవింద నామ స్మరణతో భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు, ఒక్కసారిగా పాములను చూసి భయంతో పరుగులు తీశారు.

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, అనూహ్యంగా రెండు భారీ పాములు ప్రత్యక్షమవ్వడం సంచలనం సృష్టించింది. శేషాచలం అడవులకు ఆనుకుని ఉండే తిరుమల కొండపై అప్పుడప్పుడు వన్యప్రాణులు సంచరించడం చూస్తుంటాం. కానీ భక్తులు వేచి ఉండే క్యూ లైన్ల వద్దే పాములు రావడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. అందులో ఒకటి 8 అడుగులు ఉండగా, మరొకటి 6 అడుగుల పొడవు ఉంది. జనాల రద్దీ మధ్య ఈ పాములు తిరుగుతుండటంతో భక్తులు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు.
పరిస్థితిని గమనించిన టీటీడీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రఖ్యాత స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకున్నారు. భక్తుల మధ్య బుసలు కొడుతూ హల్చల్ చేస్తున్న ఆ రెండు పాములను ఆయన ఎంతో అనుభవంతో, ఎటువంటి హాని కలగకుండా బంధించారు. పట్టుకున్న పాములను ప్రత్యేక బ్యాగులోకి మార్చి, భక్తులకు ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడ్డారు.
వీడియో ఇక్కడ చూడండి..
పట్టుబడిన ఆ రెండు పాములను భాస్కర్ నాయుడు దూరంగా ఉన్న శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. పాములను పట్టుకోవడంతో అప్పటివరకు భయం భయంగా గడిపిన భక్తులు శాంతించారు. అటవీ ప్రాంతం నుండి పాములు, చిరుతలు వంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు వస్తుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు క్యూ లైన్ల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




