AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల హామీలే ఇప్పుడు భారంగా.. ప్రజాప్రతినిధులకు వినాయక చందాల సెగ!

మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులకు వినాయక చవితి చందాల సెగ తగులుతోంది. ఎన్నికల ఖర్చుల నుంచి కోలుకోకముందే, గణపతి మండపాల నిర్వాహకులు చందాల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యేల వరకు అందరూ ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. గత ఎన్నికల హామీలు, అదనపు ఖర్చులు కలగలిపి, ఈ పండుగ నేతలకు కొత్త తలనొప్పిగా మారింది. కొందరు స్వంత నిధులతో ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల హామీలే ఇప్పుడు భారంగా.. ప్రజాప్రతినిధులకు వినాయక చందాల సెగ!
Vinayaka Chaturthi Donations Burden
P Shivteja
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 6:07 PM

Share

ఎన్నికల ఖర్చులు సర్దుబాటు కాకముందే.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులకు వినాయక చందాల సెగ తగులుతోందట. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వరకు.. ఉత్సవ కమిటీల నుంచి చందాల కోసం ఒత్తిడి పెరుగుతోందని నేతలు వాపోతున్నారట..వినాయక నవరాత్రులు వచ్చాయంటే గ్రామాలు, పట్టణాల్లో సందడి మొదలవుతుంది. గణపతి మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొందరు సొంత నిధులతో వేడుకలు నిర్వహిస్తే.. మరికొందరు చందాలు సేకరిస్తుంటారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కలిసి ఉత్సవ కమిటీలు చందాలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల హామీలే ఇప్పుడు భారంగా..

గతేడాది పంచాయతీ ఎన్నికల సమయంలో పలువురు సర్పంచ్ అభ్యర్థులు వినాయక చవితికి భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయట. ఈ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కౌన్సిలర్, చైర్మన్ పదవులను ఆశించిన నేతలు తమ వార్డుల్లోని ఉత్సవ కమిటీలను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చి.. గెలిచిన నేతలు బాధ్యతలు చేపట్టినా, ఇప్పుడు అసలు పరీక్ష మొదలైందని కొందరు ప్రజాప్రతినిధులు వాపోతున్నారట.ఎన్నికల్లో చేసిన ఖర్చుల నుంచి ఇంకా కోలుకోకముందే వినాయక చవితి చందాల కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని చెబుతున్నారట.

ఎమ్మెల్యేలు, ఎంపీలకు తప్పని చందాల ఒత్తిడి

చందాల తలనొప్పి గ్రామాలు, వార్డుల ప్రజాప్రతినిధులకే పరిమితం కాలేదట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ ఉత్సవ కమిటీల నుంచి పిలుపులు వస్తున్నాయట. ఒక్కో మండపానికి ఎంతోకొంత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.ఒక్కరికి చందా ఇస్తే.. మిగతా మండపాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయనే భయంతో కొందరు నేతలు తప్పించుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఎంతోకొంత ఇచ్చి విషయం బయటకు చెప్పొద్దని కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆశావహులకు మరో భారం

త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల్లోనూ చందాల వ్యవహారం గుబులు రేపుతోందట. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనే అంచనాల మధ్య.. ఇప్పుడే వినాయక చవితి చందాలు అదనపు భారంగా మారాయని కొందరు ఆశావహులు ఆందోళన చెందుతున్నారట.

సొంత నిధుల వైపు ఉత్సవ కమిటీలు..

మరోవైపు రాజకీయ నాయకులపై పూర్తిగా ఆధారపడితే ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో కొన్ని ఉత్సవ కమిటీలు సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. చందాలు వచ్చినా.. రాకపోయినా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారట.మొత్తంగా.. ఎన్నికల ఖర్చులు, ఇచ్చిన హామీల భారం ఒకవైపు.. వినాయక చవితి చందాల ఒత్తిడి మరోవైపు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో గణనాథుడి పండుగ నేతలకు కొత్త తలనొప్పిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us