Hyderabad: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు..
ప్రయాణీకుల అవసరాలు, ఆయా మార్గాల్లో రద్దీ అనుగుణంగా భారతీయ రైల్వే మరో 3 రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. ఆయా ట్రైన్స్ హైదరాబాద్ లోని ప్రతీ స్టేషన్లో ఆగుతాయి. మరి అవేంటో ఇప్పుడు ఈ స్టోరీ తెలుసుకుందామా.. ఓ సారి చూసేయండి.

పెరుగుతున్న జనాభా, ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది. కాచిగూడ నుంచి మరో 3 రెగ్యులర్ రైలు సర్వీసులను ప్రారంభించింది. ఈ రైళ్లకు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి టర్మినల్లు స్టాప్లుగా ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కు అనుగుణంగా సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ ట్రైన్స్ను.. రెగ్యులర్ ట్రైన్స్గా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది.
రైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళలోని ట్యూటికోరిన్కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా వెళ్తుంది.
రైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం.లకు షాలిమార్లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
మొత్తంగా 3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి 5 వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజులలో మరిన్ని అధునాతన రైళ్లు, రద్దీ ఉన్న మరిన్ని కొత్త మార్గాలకు రైలు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
ఇది చదవండి: డిస్కౌంట్ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్
