Warangal: పొద్దున్నే లేచేసరికి ఇంటి గోడ వద్ద కనిపించిన మూట.. ఓపెన్ చేయగా
ఇంట్లో దాచుకున్న పుత్తడి అంతా దోచుకెళ్లిపోయారు దొంగలు. దీంతో ఆ కుటుంబ సభ్యల బాధకు అంతు లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆసక్తికర ఘటన జరిగింది.
ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్గా జరుగుతాయ్. ఓ ఇంట్లో బంగారం చోరీ చేసిన దొంగల బుద్ది ఒక్కసారిగా మారిపోయింది. కాజేసిన 39 తులాల గోల్డ్లో.. 27 తులాల్ని తిరిగి బాధితుల ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన వరంగల్ జిల్లాలోని బొల్లికుంటలో వెలుగుచూసింది. ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటున్న గోపి అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల దొంగలు పడ్డారు. ఇంట్లోని బంగారం అంతా ఎత్తుకుపోయారు. బాధితులు పోలీసులు ఆశ్రయించారు. ఖాకీలు కేసు నమోదు చేసుకుని.. క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు. డాగ్ స్క్వాడ్తో ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు జరిపారు.
ఈ లోపే ఊహించని ఘటన జరిగింది. పోయిన బంగారం ఆదివారం ఉదయాన్నే బాధితుల ఇంటి ప్రహరీ వద్ద కనిపించింది. ఓ మూట కట్టి అక్కడ పెట్టి వెళ్లారు. పోయిన బంగారంలో 3 తులాలు మినహా.. మిగతాది అంతా తెచ్చి అక్కడ పెట్టి వెళ్లారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ఎవరో తెలిసినవాళ్ల పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల భయంతోనే మళ్లీ అక్కడ పెట్టి వెళ్లారని అంటున్నారు. అయితే మిగిలిన 3 తులాలు కూడా తమ వద్దకు వచ్చేలా చూడాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..