Cyber Crime: తెలంగాణపై సైబర్ నేరస్థుల పంజా.. మోసాలు ఎలా జరుతున్నాయంటే.
తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదికల ప్రకారం గడిచిన 8 నెలల్లో తెలంగాణ వాసులు ఏకంగా రూ. 707.25 కోట్లను కోల్పోయారు. 2023లో రాష్ట్రంలో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతోన్న మొత్తం సైబర్ నేరాల్లో తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండడం రాష్ట్రంపై సైబర నేరస్థుల పంజా ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా 5 విధానాల్లో సైబర్..

మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రజల అమయకత్వాన్ని, అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని దర్జాగా ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి సైబర్ మోసాలకు గురవుతోన్న వారిలో తెలంగాణకు చెందిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదికల ప్రకారం గడిచిన 8 నెలల్లో తెలంగాణ వాసులు ఏకంగా రూ. 707.25 కోట్లను కోల్పోయారు. 2023లో రాష్ట్రంలో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతోన్న మొత్తం సైబర్ నేరాల్లో తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండడం రాష్ట్రంపై సైబర నేరస్థుల పంజా ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా 5 విధానాల్లో సైబర్ దాడులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ విధానాలు ఏంటి.? సైబర్ నేరాల బారిన పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇటీవల పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో సైబర్ నేరస్థులు వల విసిర అప్పనంగా దోచేస్తున్నారు. టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ విధానంలో తొలుత కొంత మొత్తాన్ని పెట్టి, ఏదైనా టాస్క్ చేయమని చెబుతారు. అది కూడా వీడియోకు లైక్ చేయడం లేదా ఇన్స్టాలో ఏదైనా అకౌంట్ను ఫాలో చేయడం లాంటి సింపుల్ టాస్క్లు ఉంటాయి. దీంతో ప్రజలు దీనికి త్వరగా ఆకర్షితులవుతున్నారు. మొదటి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి, భారీగా పెట్టుబడి పెట్టిస్తారు. తీరా చివరికి మొండి చేయి చూపిస్తారు. కాబట్టి ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
* ఇక కొరియర్ల పేరుతోనూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. విదేశాల నుంచి మీకు పార్శిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కొరియర్ సంస్థ పేరుతో ఫోన్ చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పించాలంటే వెంటనే డబ్బులు చెల్లించాలని , లేదంటే అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఇలాంటి సంఘటనలు కూడా ఇటీవల బాగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బెంగళూరుకు చెందిన ఓ టెకీ.. ఇలాంటి వలలో పడి రూ. లక్షలు చెల్లించుకుంది.
* ఇక ఓఎల్ఎక్స్ తరహా మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధానంలో మొదట నేరస్థులు వాహనం అమ్మకానికి ఉందని ప్రకటన ఇస్తారు. అనంతరం ఆసక్తి ఉన్న వారు అప్రోచ్ కాగానే.. వాహనం ఎయిర్ పోర్ట్ పార్కింగ్లో ఉందని, రవాణా ఛార్జీలు పంపిస్తే వాహనం అందిస్తామంటూ నమ్మిస్తారు. డబ్బులు పంపగానే, మరో కారణం చెప్పి మరికొంత లాగుతారు. ఇలా అందినడానికి దోచుకొని తర్వాత ఫోన్ స్విచాఫ్ చేస్తారు.
* క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ల మోసాలు కూడా ఇటీవల ఎక్కువవుతున్నాయి. కార్డులు అప్గ్రేడ్ చేయాలని లేని పక్షంలో కార్డులు బ్లాక్ అవుతాయంటూ కస్టమర్ కేర్ రూపంలో తొలుత కాల్ చేస్తారు. ఆ తర్వాత కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే తాము పంపే లింక్ ఓపెన్ చేసి ఫామ్ నింపాలని చెబుతారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే చాలు.. వెంటనే మీ ఫోన్ లేదా కంప్యూటర్లోకి మాల్వేర్ను పంపించి కార్డుల గడువు తేదీ, సీవీవీ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను దొంగలించి ఎంచక్కా డబ్బులు కాజేస్తున్నారు.
* సైబర్ మోసాల్లో లోన్ యాప్స్ ఒకటి. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే, క్షణాల్లోనే డబ్బులు ఇస్తారు. ఇక ఆ తర్వాత విపరీతమైన వడ్డీ రేట్లతో వాయించేస్తారు. గడువులోపు అసలు, వడ్డీ చెల్లించకపోతే.. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తామంటారు. యాప్ డౌన్లోడ్ సమయంలో ఫోన్కు సంబంధించిన అన్ని పర్మిషన్స్ తీసుకొని ఫోన్లోని కాల్ డేటాను సేకరిస్తారు. లోన్ తీసుకున్న వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్లు చేసి వేధిస్తుంటారు. కాబట్టి లోన్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..