TGSRTC: తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం.. డేటా సైన్స్‌ టెక్నాలజీతో..

ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం హైదరాబాద్ బస్ భవన్‌లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్...

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం.. డేటా సైన్స్‌ టెక్నాలజీతో..
Tgsrtc
Follow us

|

Updated on: Jul 11, 2024 | 6:52 PM

ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ముఖ్యంగా మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం అని విభాగాల్లో అనివార్యంగా మారింది. ఇక తాజాగా తెలంగాణ ఆర్టీసీ సైతం టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. డేటా సైన్స్‌ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి చెబుతున్నారు.

ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం హైదరాబాద్ బస్ భవన్‌లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వినియోగం’ అనే అంశంపై శరత్ కాటిపల్లి ప్రసగించారు. ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని తమ బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చడం గొప్ప విషయమని ఆయన అన్నారు. వారి ప్రయాణ డేటాకు అనుగుణంగా రియల్ టైంలో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని చెప్పారు.

మెసేజ్, మెసేంజర్, మెకానిక్స్, మెషినరీ అనే 4ఎం కాన్సెప్ట్‌తో సంస్థను ఉన్నతస్థాయికి ఎలా తీసుకువెళ్లోచ్చో వివరించారు. సాంకేతికతలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు సంతృప్తికర సేవలను అందించే తీరును తన అనుభవంతో ఉదాహరించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలంగాణకు చెందిన శరత్ కాటిపల్లి.. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అమెరికాలో చేశారు. అలాగే, ప్రముఖ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసించారు. అనంతరం మల్టీ నేషనల్ సంస్థలైన లెక్స్ మార్క్, జీఏపీ ఐఎన్సీ, ఐబీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, హెచ్ఎస్బీసీ, అమెజాన్ లాంటి సంస్థల్లో డేటా సైంటిస్ట్ గా విధులు నిర్వర్తించారు.

జేపీ మోర్గాన్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థకు చీఫ్ డేటా ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ లూషియా ఏఐకి అడ్వైజర్ గా కొనసాగుతున్నారు. డేటా సైన్స్‌ను వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలకు జీవనాడిలాగా డేటా సైన్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన సేవలందించేందుకు డేటా విశ్లేషణను వినియోగించుకుంటున్నామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..