Telangana: ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్.. అర్ధరాత్రి నుంచే సేవలు నిలిపివేత..!
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు బంద్కు పిలుపునిచ్చాయి. డ్రైవర్ల సంక్షేమ హామీలు అమలు చేయలేదని, పెరిగిన చార్జీలు, బైక్ ట్యాక్సీల నియంత్రణ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల జీవనోపాధి దెబ్బతిందని ఆరోపిస్తున్నారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

తెలంగాణలో ప్రయాణికులకు కీలక అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు, యాప్ ఆధారిత వాహనాలు, స్కూల్ వ్యాన్ల సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఆటో, క్యాబ్, ప్రైవేట్ రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం, 23వ తేదీ అర్ధరాత్రి నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. దీంతో సోమవారం ఉదయం నుంచి రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి ఏడాది రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అమలులో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీలను నియంత్రించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. బైక్ ట్యాక్సీల స్థానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక యాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తోంది. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. తమ జీవనోపాధిపై ఈ పథకం తీవ్ర ప్రభావం చూపిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని జేఏసీ కోరుతోంది. స్పందన లేకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేసి అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో బంద్ ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
