Telangana: ట్రాఫిక్ చలాన్ల నగదు నేరుగా అకౌంట్ల నుంచి కట్ అవుతుందా..? ఇదిగో క్లారిటీ
తెలంగాణలో ట్రాఫిక్ చలానా పడితే బ్యాంక్ ఖాతా నుంచే నేరుగా డబ్బు కట్ చేస్తారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తాజాగా స్పష్టత ఇచ్చింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించింది.

తెలంగాణలో ఎక్కడైనా వాహనంపై ట్రాఫిక్ చలానా పడితే.. ఆ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుంచే కోత అయ్యేలా చర్యలు తీసుకోవాలని, టెక్నాలజీ వాడుకుంటూ బ్యాంకులను సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి జనవరి నెలలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రవాణా, పోలీస్ శాఖ ప్రణాళికలు రూపొందించినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారనే వార్తలను ఖండించింది. అలాంటి ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. చలాన్ల కోసం రిజిస్ట్రేషన్ నంబర్లను లేదా ఓనర్ల బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసి, డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదని వివరణ ఇచ్చింది. అలాంటి విధానాన్ని అమలు చేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.
మరోవైపు ట్రాఫిక్ ఉల్లఘించేవారిపై దురుసుగా వ్యవహరించవద్దని తెలంగాణ హైకోర్టు గత నెలలో పోలీసులకు సూచించింది. వాహనాలు తాళం చేతులు తీసుకోవడం, ఫైన్స్ కడితేనే బైక్ ఇస్తా అని ఒత్తిడి చేయడం వంటివి చేయొద్దని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి నోటీసులు జారీ చేయాలని.. చలాన్ల కట్టకుండా నిర్లక్ష్యం చేస్తే చట్టం ప్రకారం.. ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. వాహనదారులను తనిఖీ చేస్తూ.. విధులు నిర్వర్తించేవారికి ఈ ఆదేశాలు అడ్డంకి కావని వివరించింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ పాల్పడినవారికి ఫైన్ విధించి, చలాన్లు వసూలు చేసే అధికారాన్ని రవాణా, పోలీసుశాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 108 అమలును నిలిపివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
