AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. రేవంత్ సర్కార్ లిఖిస్తున్న ఓ కొత్త అధ్యాయం

అంతా సిద్ధమైంది.. మరికొద్దిసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. టార్గెట్ 2047.. త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం ఏర్పాట్లు, అతిథుల ఆహ్వానాలు, సెక్యూరిటీ, ఒప్పందాలు.. అన్ని విషయాలపై మినిట్‌ టు మినిట్.. పాయింట్‌ టు పాయింట్.. అన్ని మీకు అందించబోతుంది టీవీ9.

Telangana: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం..  రేవంత్ సర్కార్ లిఖిస్తున్న ఓ కొత్త అధ్యాయం
Telangana Rising Global Summit
Ram Naramaneni
|

Updated on: Dec 08, 2025 | 11:59 AM

Share

గేమ్‌ ఛేంజర్‌ వేడుకకు వేళైంది. ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణలోని రేవంత్ సర్కార్‌ విజన్‌ మరికాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది. దేశవిదేశాల నుంచి అతిథుల విచ్చేశారు. 2 రోజులు 27 సెషన్లు..కీలక ప్రసంగాలు ..మరెన్నో విశేషాలు.. నెవర్‌ బిఫోర్‌ అనేలా గ్లోబల్‌ సమ్మిట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ సర్కార్‌ పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేళ్లయింది.  2047 నాటికి  తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను  త్రీ ట్రిలియన్‌ డాలర్ల‌కు అభివృద్ధి చేయడమే  లక్ష్యంగా రేవంత్‌ సర్కార్‌   గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్రాలతో కాదు  అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా ప్రణాళికలకు పదను పెట్టారు.

వేదిక సిద్దమైంది. వేడుకకు వేళాయింది. ముచ్చర్ల  ఫ్యూచర్‌ సిటీలో  వంద ఎకరాల్లో విశాల ప్రాంగణం..దేశ విదేశ ప్రతినిధులతో  2 రోజులు.. 27 సెషన్లలో రైజింగ్‌ తెలంగాణ కోసం కీలక చర్చలు జరుపుతారు.  గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణలో  వార్‌  రూమ్‌..డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్ ఇలా ప్రతీది ఓ  వండర్‌. మెయిన్‌ హాల్‌లో  2 వేల 5వందల మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మెయిన్‌ హాల్‌కు ఇరువైపులా ఆరు మినీ హాల్స్‌.. ఎగ్జిబిషిన్‌ స్టాల్స్‌   ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళా శక్తి, హైడ్రా సహా  తెలంగాణ అభివృద్ధి పథకాలను శాఖలవారీగా  డిస్‌ ప్లే చేస్తూ స్టాల్స్‌  ఏర్పాటు చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌  ప్రాంగణమంతా  భారీ టెంట్లు.. నలువైపులా  డిజిటిల్‌ స్ర్కీన్లతో కలర్‌ఫుల్‌గా వుంది.  సమ్మిట్‌కు వచ్చిన అతిథులకు రోబో స్వాగతం పలుకుతుంది.

గ్లోబల్‌ సమ్మిట్‌కు  44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు  హాజరవుతారు. బెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తరలివస్తారు. కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, పార్టీల నేతలు  హాజరవుతారు. దాదాపు 2వేల 5 వందల మంది ప్రముఖులు గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొంటున్న దృష్ట్యా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సెక్యూరిటిటీని కట్టుదిట్టం చేశారు.  మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 6వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిన్నటి దాక ఒక లెక్క.. గ్లోబల్‌ సమ్మిట్‌  తరువాత తెలంగాణ  రైజింగ్‌ మరో లెక్క..అంటూ మహాసంకల్పంతో ఏదైనా సాధ్యమేనని  ట్వీట్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.  వేదిక అదిరింది. వేడుకకు వేళాయింది. ఒక్కమాటలో చెప్పాలంటే  గ్లోబల్‌  సమ్మిట్‌ వేదిక, వేడుక  తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌  2025 విజన్‌ డాక్యుమెంట్‌‌కు, సర్కార్‌ విజన్‌కు అద్దంపడుతోంది. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. సమ్మిట్ జరిగే ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి.