Arasavalli: అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు…
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడు జరగాల్సిన అరుదైన సూర్యకిరణాల ఘట్టం భక్తులను నిరాశపరిచింది. ఆనవాయితీ ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకాల్సి ఉన్నా, ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఈ అద్భుత దృశ్యం కనిపించలేదు. స్వామివారి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడు జరగాల్సిన అరుదైన ఘట్టం భక్తులను కొంత నిరాశకు గురిచేసింది. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీలలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి మూలవిరాట్టును తాకుతాయి. అయితే ఈసారి ఆకాశం మేఘావృతంగా ఉండటంతో సూర్యకిరణాలు స్వామివారిపై పడలేదు. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సహా అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ మేఘాలు కమ్ముకోవడంతో సూర్యకిరణాలు కనిపించకపోవడంతో భక్తుల ఆశలు నెరవేరలేదు. అయితే ఆనవాయితీ ప్రకారం రేపు కూడా సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకే అవకాశం ఉందని ఆలయ అర్చకులు తెలిపారు.
అరసవల్లి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీలతో పాటు అక్టోబర్ 1, 2 తేదీలలో కూడా సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోని మూలవిరాట్టును తాకడం ప్రత్యేకతగా భావిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల సందర్భంలో నిర్ణీత సమయంలో ఈ అద్భుత ఘట్టం జరుగుతుందని చెబుతారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా కొన్ని ఆలయాల్లో అప్పుడప్పుడు సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించడం కనిపించవచ్చు. కానీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాత్రం ఇది ప్రతి ఏడాది నిర్ణీత తేదీలలో క్రమం తప్పకుండా జరుగుతుండటం విశేషం. అంతేకాకుండా ఆలయ ప్రధాన ద్వారం నుంచి సుమారు 70 అడుగుల లోపల ఉన్న మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకడం మరో ప్రత్యేకత. అలివేటి మండపం, ధ్వజస్తంభం, గర్భగుడి ద్వారాలను దాటి స్వామివారిని తాకే ఈ దృశ్యాన్ని భక్తులు దైవ లీలగా భావిస్తారు.
