AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులు జర భద్రం.. ఇక చుక్కేస్తే చిక్కినట్టే..! హాట్‌స్పాట్‌లను గుర్తించిన పోలీసులు..

అలాంటి హాట్‌స్పాట్‌లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులు..కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ పట్టుబడుతున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు.

మందుబాబులు జర భద్రం.. ఇక చుక్కేస్తే చిక్కినట్టే..! హాట్‌స్పాట్‌లను గుర్తించిన పోలీసులు..
Drunk And Drive In Hyderaba
Jyothi Gadda
|

Updated on: May 16, 2023 | 2:07 PM

Share

అర్ధరాత్రి దాటిన తర్వాత నమోదయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. అర్థరాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగిన కేసుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపే వారితో రోడ్డు ప్రమాదాలు జరిగిన హాట్‌స్పాట్‌లను ప్రత్యేక బృందాలు గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ స్పెషల్ టీమ్‌లకు ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. పట్టుబడిన వారందరినీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటారు. అర్ధరాత్రి దాటి బయటకు వచ్చి డ్రైవ్ చేస్తే తప్పించుకోవచ్చని భావిస్తే..వదిలిపెట్టేది లేదని జి సుధీర్ బాబు అన్నారు.

నగరంలో హోటళ్లు, బార్‌లు, పబ్‌లు అధికంగా ఉండటంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి హాట్‌స్పాట్‌లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులు..కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ పట్టుబడుతున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13,431 మందిని పట్టుకోగా, 1317 మందిని జైలుకు పంపారు. 243 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో రోడ్డు రవాణా సంస్థ అధికారులు 53 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినందుకు గాను మొత్తం రూ.3,21,39,060 జరిమానా విధించారు. పట్టుబడిన వారు గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణా సంస్థలో కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us