Telangana: మీ-సేవలో అందించే సేవలన్నీ వాట్సప్లోనే.. తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్..
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇక నుంచి మీ-సేవకు వెళ్లాల్సిన పని ఉండదు. ఏ ప్రభుత్వ సేవ కావాలన్నా వాట్సప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని సేవలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించగా.. త్వరలో గ్యాస్ బుకింగ్, అత్యవసర సేవలను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకురానుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలు సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. అన్ని రకాల సేవలను డిజిటలైజ్ చేస్తోంది. సులువుగా ప్రభుత్వ సేవలను ప్రజలు ఇంటి వద్ద నుంచే పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యూరియా బుకింగ్, టీ రేషన్ వంటి యాప్లను తీసుకురాగా.. ఇక మీ-సేవలో అందించే సేవలను వాట్సప్ ద్వారానే పొందేలా కొత్త సౌకర్యం కల్పిస్తోంది. దీని వల్ల మీ-సేవకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాట్సప్ మీ సేవ ఫ్లాట్ఫామ్ ద్వారా అత్యవసర సేవలను కూడా పొందవచ్చు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
గ్యాస్ బుకింగ్ కూడా..
ఇక నుంచి వాట్సప్ మీ-సేవ ద్వారా గ్యాస్ సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాదు.. 101, 102, 108 వంటి అత్యవసర ఎమర్జెన్సీ సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఇక మిగతా హెల్ప్ లైన్ నెంబర్ల అన్నీ వాట్సప్ మీ-సేవ ఫ్లాట్ఫామ్కు యాడ్ చేయనున్నారు. దీంతో వాట్సప్ ద్వారానే ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వాట్సప్ మీ-సేవ సదుపాయం వల్ల ప్రభుత్వ సర్టిఫికేట్లు, రాష్ట్రంలోని దేవాలయాల దర్శనం టికెట్లు, సందర్శన ప్రాంతాల ఎంట్రీ టికెట్లు పొందే అవకాశం కల్పించింది. ఇక ఫిర్యాదులు, అప్లికేషన్ స్టేటస్ వంటి సేవలుప్ ద్వారా పొందవచ్చు. ఇక పేమెంట్స్ కూడా దీని ద్వారానే చేయవచ్చు. ప్రస్తుతం 581 ప్రభుత్వ సేవలు ఈ వాట్సప్ మీ సేవ ద్వారా పొందే అవకాశం ఉంది.
ప్రజల నుంచి స్పందన
గత ఏడాది నవంబర్ 18వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ వాట్సప్ మీ సేవ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. 8096958096 వాట్సప్ నెంబర్ ద్వారా ప్రజలు సేవలు పొందవచ్చు. 24 గంటలపాటు ఎప్పుడైనా ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది ఈ సేవలు పొందారు. దీని వల్ల ప్రజలు ప్రతీ పనికి మీ సేవకు వెళ్లాల్సిన పని తప్పింది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. మీ సేవకు వెళ్లాలంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామాల్లోని ప్రజలకు పట్టణాలకు వెళ్లాలంటే సమయం వృథా అవ్వడంతో పాటు ప్రయాణ ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఆ రెండూ ఆదా అవుతాయి. ఇక మొబైల్ నుంచే వేగంగా ప్రభుత్వం సేవలు పొందవచ్చు.
