Telangana: ప్రతీ నెలా నేరుగా అకౌంట్లోకి రూ.2 వేలు.. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా వృద్దులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సామాజిక పింఛన్లను అందిస్తోంది. ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా వీటిని ప్రభుత్వం ప్రతీ నెలా అందిస్తోంది. అయితే ఇప్పుడు వాటిల్లో కూడా మార్పులు చేసింది.

పెన్షన్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేరుగా పింఛన్ సొమ్మును లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఆసరా పథకం ద్వారా లబ్దిదారులకు ఇస్తున్న పింఛన్ నగదును అకౌంట్లో జమ చేయాలని సూచించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందిస్తుండగా.. ఈ విధానంలో మార్పులు చేశారు. ఇక నుంచి నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డ్, సామాజిక, ఆర్ధిక సర్వే నివేదికల ఆధారంగా పింఛన్లను క్రమబద్దికరించాలని సూచించారు.
ఒకటో తేదీనే జీతాలు
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై చర్చలు జరగ్గా.. ఈ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పెన్షన్లను అర్హులైనవారికి మంజూరు చేయాలని, ఇందులో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెలా ఒకటవ తేదీన జీతాలు అందించాలని తెలిపారు. అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకటినే జీతాలు జమ చేయాలన్నారు. ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు అందించాలని సూచించారు. ఒక్క రోజు ఆలస్యమైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒకటో తేదీనే జీతాలు పంచాయతీ సిబ్బందికి ఇచ్చేందుకు ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేస్తుందని తెలిపారు. అలాగే పంచాయతీలు ట్రెజరీ అకౌంట్లో కాకుండా బ్యాంకుల్లో ఆదాయాన్ని జమ చేసేలా చట్ట సవరణ చేయనున్నామని రేవంత్ సూచించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3) సవరించాలన్నారు.
అధికారులకు కీలక ఆదేశాలు
ఐఏఎస్లకు ప్రతీ నెలా ఒకటినే జీతం ఇచ్చినట్లు పంచాయతీ సిబ్బందికి కూడా అందించాలని అధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చారు. పంచాయతీల సొంత ఆదాయంపై స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. కాగా ఆసరా పింఛన్ పథకం ద్వారా వృద్దులు, ఒంటరి మహిళలకు రూ.2 వేలు అందిస్తుండగా.. దివ్యాంగులకు రూ.3 వేలు ఇస్తున్నారు.
