Monkeypox: దేశంలో మంకీపాక్స్ అలజడితో తెలంగాణ సర్కార్ అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో టెస్ట్లు
Monkeypox: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నామో లేదో.. మరో వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలోకి చొరబడిన కొత్త వైరస్తో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రపంచాన్ని..
Monkeypox: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నామో లేదో.. మరో వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలోకి చొరబడిన కొత్త వైరస్తో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంతలోనే దేశం నెత్తిన మరో పిడుగు పడింది. యూరప్ దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మంకీపాక్స్.. క్రమంగా భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల కేసులకుపైగా నమోదుకాగా, మహమ్మారికి నలుగురు బలయ్యారు. ప్రాణాంతకమైన వైరస్ కాకున్నా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. అప్రమత్తంగా ఉంటూ మహమ్మారిపై సంఘటితంగా పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుజూడడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి కోరలు చాచకముందే అణచివేసేందుకు వైద్యశాఖ భారీసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పూణె వైరాలజీ ల్యాబ్ నుంచి ఇవాళ టెస్టింగ్ కిట్లను తెప్పిస్తోంది. కిట్లు రావడమే ఆలస్యం ట్రయల్ రన్స్ ప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్ టెస్టులు చేయనున్నారు. బ్లడ్, స్వాబ్, స్కిన్పై ఉన్న నీటిబుడగల నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు. మంకీపాక్స్ అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు వైద్యశాఖ రెడీ అయ్యింది.
అప్రమత్తమైన కేంద్రం..
దేశంలో మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు జ్వరం, జలుబు ఉన్న వాళ్లతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది. ఎలుకలు, వన్యప్రాణులు, ఉడుతలు ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి