వారికి సీఎం రేవంత్ అదిరిపోయే గుడ్న్యూస్.. మంచి ప్రతిభ కనబరిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు!
మైనార్టీలకు సీఎం రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. మైనార్టీ విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, ఏఐ ట్రైనింగ్, భారీ ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మైనార్టీ విద్యార్థుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సంప్రదాయ కోర్సులతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. విద్య పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు పెరిగేలా కోర్సులు రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. యువత స్వయం ఉపాధి దిశగా ఎదగడానికి అవసరమైన శిక్షణ అందించాలని స్పష్టం చేశారు. ప్రతిభ కనబరిచిన మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న తరహాలోనే మైనార్టీ విద్యార్థులకు కూడా ప్రత్యేక పథకం తీసుకురావాలని ఆదేశించారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎంపికైన మైనార్టీ అభ్యర్థులకు శాఖలో బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. శాఖ కార్యక్రమాలపై వారికి ప్రత్యక్ష అవగాహన కల్పించాలని సూచించారు. ఇమామ్లు, మౌజమ్లకు ఇచ్చే గౌరవ వేతనాలు ఆలస్యం కాకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మైనార్టీ పాఠశాలల్లో ఆధునిక బోధన విధానాలు అమలు చేయాలని చెప్పారు.
ఇదిలా ఉండగా డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రీట్రోఫిట్టింగ్ ప్రణాళికను కూడా సీఎం వెల్లడించారు. దీంతో ఆటో డ్రైవర్ల ఇంధన ఖర్చులు తగ్గి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ గంగా జమునా తెహ్జీబ్ ప్రతిబింబించేలా ఈ నిర్మాణాలు ఉండాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతులు, మతాల విశిష్టతను తెలియజేసే అధ్యయన కేంద్రాలుగా ఈ కట్టడాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
