AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. వంద కోసం దారుణం! ప్రాణాలు కోల్పోయిన ఛాయ్‌వాలా.. చావు బతుకుల మధ్య మరొకరు!

మనుషుల్లో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణం బలికావడం అత్యంత శోచనీయం. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రూ. వంద కోసం దారుణం! ప్రాణాలు కోల్పోయిన ఛాయ్‌వాలా.. చావు బతుకుల మధ్య మరొకరు!
Murder For Rs 100
Balaraju Goud
|

Updated on: Apr 21, 2026 | 8:19 AM

Share

కేవలం వంద రూపాయల చిల్లర గొడవ ఒక నిరుపేద కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో ఆదివారం (ఏప్రిల్ 19) జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గ్రామంలోని ఒక టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే శంకరయ్య, ఎవరితోనూ గొడవకు వెళ్లే వ్యక్తి కాదు. అయితే, అదే గ్రామానికి చెందిన ఆదిల్ ఖాన్ అనే వ్యక్తి శంకరయ్య వద్దకు వచ్చి రూ. 100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కష్టపడి పనిచేసే శంకరయ్య ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది.

ఆ స్వల్ప వివాదం కాస్తా పెను ఘర్షణకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన ఆదిల్ ఖాన్, తన వెంట తెచ్చుకున్న కత్తితో శంకరయ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్తపై దాడి జరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిన అతని భార్య, ప్రాణాలకు తెగించి అడ్డుపడింది. కానీ, ఉన్మాదిలా మారిన నిందితుడు ఆమెను కూడా కత్తితో పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఆ దంపతులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, శంకరయ్య చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ఈ విషాద ఘటనతో గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమవుతోంది.

దండేపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో ముత్యంపేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి కోపం ఒక కుటుంబాన్ని ఎలా రోడ్డున పడేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us