Telangana: బీజేపీ నేత ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. ఏం జరిగింది అంటే
టెక్నాలజీ రోజు రోజుకూ మరింత డెవలప్ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్వాచ్లు హవా నడుస్తోంది. అవి మరింత అడ్వాన్స్డ్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అవి కొన్నిసార్లు మనుషుల ప్రాణాలను సైతం కాపాడుతున్నాయి.

మీకు స్మార్ట్ వాచ్లు వాడే అలవాటు ఉందా..? అందునా యాపిల్ వాచ్ అంటే మోజా..? అయితే దాచుకున్న సొమ్ముతో అయినా కొనేయండి.. లేదా మీ ఆప్తులకు గిఫ్టుగా అయినా ఇచ్చేయండి. కాస్త ఖరీదు ఎక్కువే అయినా వెనకాడకండి. ఏంటి మేం యాపిల్ వాచ్ను ప్రమోట్ చేస్తున్నాం అనుకునేరు. అసలు విషయం వేరే ఉంది. స్మార్ట్ వాచ్లు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వాటిల్లో మన హెల్త్ ట్రాకింగ్ కూడా తెలిసిపోతుంది. మనం రోజు ఎంత దూరం నడుస్తున్నాం.. ఎన్ని కేలరీలు ఖర్చు చేశాం.. మన బీపీ ఎంత ఉంది.. పల్స్ ఎలా ఉంది.. హార్ట్ రీడింగ్స్ ఉన్నాయ్ లాంటి డేటాను యాపిల్ వాచ్లు దాదాపు కచ్చితంగా చెప్పేస్తున్నాయి. పలు సందర్భాల్లో ఇవి మనుషులు ప్రాణాలను కాపాడాయి కూడా. వాచ్ ధరించిన కొందరు.. హెల్త్ రిపోర్ట్ను ట్రాక్ చేసి.. సకాలంలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. యాపిల్ స్మార్ట్ వాచ్ బీజేపీ నేత ప్రాణాలను నిలబెట్టింది. ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసి ప్రాణాన్ని నిలబెట్టింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల బీజేపీ ప్రెసిడెంట్ ప్రతాప రామకృష్ణకు ఇటీవల ఒంట్లో నలతగా ఉంటోంది. నాలుగు అడుగులు వేస్తే.. బాగా ఆయాసం వస్తోంది. అంతేకాదు ఛాతీలో మంట కూడా ఉంటుంది. గ్యాస్ వల్ల ఏమో అనుకుని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా యాపిల్ బ్రాండ్ వాచ్ ధరించడం మంచిదైంది.
ఆ వాచ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అలెర్ట్ ఇచ్చింది. గుండెకు సంబంధించి సమస్య ఉందని అప్రమత్తం చేసింది. దీంతో ప్రతాప రామకృష్ణ అస్సలు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్లు గుండెలో రెండు రక్తనాళాలు బ్లాక్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయి.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
