AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కతో రాఖీ కట్టించుకొని వెళ్తుండగా అడ్డొచ్చిన మృత్యువు.. స్పాట్‌లో యువకుడు మృతి!

నిజామాబాద్ జిల్లాలో రాఖీ పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కతో రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై సాయిబాబు అనే 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కతో రాఖీ కట్టించుకొని వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అక్కతో రాఖీ కట్టించుకొని వెళ్తుండగా అడ్డొచ్చిన మృత్యువు.. స్పాట్‌లో యువకుడు మృతి!
Nizamabad News
Anand T
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 11, 2025 | 1:53 PM

Share

రాఖీ పండగ సందర్భంగా అక్కతో రాఖీ కట్టించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒక యువకుడు మరణించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల జగ్గారావు ఫారం వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసరకు చెందిన యువకుడు సాయిబాబు రాఖీ పండగ సందర్భంగా నిజామాబాద్​లో ఉంటున్న అక్క ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి అతని స్నేహితుడితో కలిసి వెళ్లాడు. రాఖీ కట్టించుకుని శనివారం మధ్యాహ్నం తిరిగి బాసరకు స్కూటీపై బయల్దేరారు.

అయితే మార్గమధ్యలో నవీపేట మండలం జగ్గారావు ఫారం వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న స్కూటీ అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు అరవింద్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహన దారులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న సాయిబాబు అక్కతో పాటు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కతో రాఖీ కట్టించుకొని వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన  కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు సాయిబాబు బాసరలోని సరస్వతి దేవాలయం వద్ద ఓ షాపులో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.