Droupadi Murmu: నేడు తెలంగాణకు ద్రౌపదీ ముర్ము.. రాష్ట్రపతి టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే..
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు (సోమవారం) తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముర్ము హైదరాబాద్కు చేరుకోనున్నారు. దీనికి ముందు...
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు (సోమవారం) తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముర్ము హైదరాబాద్కు చేరుకోనున్నారు. దీనికి ముందు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ‘ప్రసాద్’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు వస్తారు. బొల్లారం వార్ మెమోరియల్లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్ విందులో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఈ నెల 30వ తేదీ వరకు హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ ఐదు రోజుల సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం తొలిరోజున బొల్లారంలో యుద్ధవీరులకు నివాళులు అర్పించనున్నారు. రాత్రి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్నారు. ఇక రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారని, తర్వాత పలువురు రాష్ట్ర ప్రముఖులు కూడా రాష్ట్రపతిని కలుస్తారని తెలుస్తోంది.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయం, సమీప సిబ్బంది క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక రక్షణ బృందం భద్రత పర్యవేక్షణను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..