AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నాగర్ కర్నూల్ సీటుపై బీజేపీ గురి.. మోదీ మేనియాతో గెలవాలని ప్లాన్‌.. ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ..

PM Narendra Modi in Nagarkurnool: బీజేపీ తెలంగాణపై గట్టిగానే ఫోకస్‌ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్‌గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న సభలకు భారీగా జనసమీకరణ చేస్తోంది. ఈరోజు నాగర్‌కర్నూలు సభ సూపర్‌ హిట్‌ చేసేందుకు రెడీ అయింది.

PM Modi: నాగర్ కర్నూల్ సీటుపై బీజేపీ గురి.. మోదీ మేనియాతో గెలవాలని ప్లాన్‌.. ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2024 | 10:10 AM

Share

PM Modi Nagarkurnool Meeting: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. నిన్న మల్కాజ్‌గిరి రోడ్‌షోలో పాల్గొన్న మోదీ.. ఈరోజు నాగర్‌కర్నూలులో బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూలుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు హెలిప్యాడ్ నుంచి వాహనం ద్వారా చేరుకోనున్నారు. సభకు హాజరయ్యే వాహనదారులు సభాస్థలికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు పార్క్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఎస్సీ రిజర్వ్డ్‌ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుపై గురి పెట్టింది కమలం పార్టీ. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. మోదీ మోనియా, బీజేపీ సానుకూల వేవ్‌తో రిజర్వ్డ్ స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది బీజేపీ. ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన ముఖ్య నేతలను కలుపుకొని ముందుకు సాగుతూ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని సభతో మరింత జోష్ నింపేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. భారీ ఎత్తున జన సమీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకునేలా ప్రణాళికలు రచించారు. అంతే కాకుండా ప్రధాని మోదీ సభతో పార్లమెంట్ ఎన్నికలకు కలిసికట్టుగా సన్నధం అయ్యేలా సందేశం ఇస్తున్నారు.

సభా ఏర్పాట్లు పరిశీలించిన పాలమూరు బీజేపీ నేత డీకే అరుణ అధికార, ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇది ప్రధాని మోదీ ఎలక్షన్‌ అన్నారు. దేశంకోసం జరుగుతున్న ఎన్నికలకు కాబట్టి.. బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి తమకు పోటీ కాదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. బిఆర్ఎస్ కి ఓటేసినా మురిగిపోయినట్లే అన్నారు డీకే అరుణ.

మరి కవిత అరెస్టు నేపథ్యంలో నాగర్ కర్నూలు సభపై అందరి చూపు ఉంది. ఈ అరెస్టుపై మోదీ ఏమైనా మాట్లాడతారా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తొలిసారి నాగర్‌కర్నూల్‌ సీటు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ పార్టీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..