Telangana: వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఛార్జ్షీట్లో 10మంది..
తెలంగాణలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నయీం మరణించిన ఏళ్ల తర్వాత కూడా ఆయన అక్రమ సామ్రాజ్యంపై ఈడీ తన పట్టు బిగిస్తోంది. తాజాగా పదిమంది నిందితులపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈడీ సేకరించిన పక్కా ఆధారాలు ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

నయీం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం పదిమంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. తెలంగాణ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా తీసుకుని ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా నయీం కుటుంబ సభ్యుల పేర్లపై భారీగా ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడుల రూపంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. ఈ ఆస్తులు నేరార్జిత సంపాదనగా భావిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
గతేడాది నయీంకు చెందిన సుమారు 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాఖలైన ఛార్జ్షీట్తో ఈ కేసులో విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నయీం అక్రమ ఆస్తుల వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ స్పష్టం చేసింది. కాగా నయీం కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసులలో ఒకటిగా నిలిచింది. నయీం కార్యకలాపాలు, అక్రమ వసూళ్లు, భూకబ్జాలు, బెదిరింపుల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన పలు కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది.
ఈడీ దర్యాప్తులో నయీం నేరార్జిత సంపాదనను వివిధ మార్గాల్లో దాచినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ లావాదేవీలన్నింటినీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసినట్లు సమాచారం. ఛార్జ్షీట్ దాఖలుతో నయీం అక్రమ ఆస్తుల వ్యవహారంపై న్యాయపరమైన ప్రక్రియ మరింత ముందుకు వెళ్లనుంది. ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరగనుండగా, నిందితులపై శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు ఫలితం రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఆస్తులపై చర్యలకు దిశానిర్దేశం చేయనుందని చెబుతున్నారు. మరోవైపు ఈడీ చర్యలతో నయీం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇంకా గుర్తించని ఆస్తులు, లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతుందని తెలిపారు. అక్రమ సంపాదనపై ఎంతటి శక్తివంతులైనా చట్టానికి లోబడాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
