MLC Election: రసవత్తరంగా నల్లగొండ -ఖమ్మం -వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక..!
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ్టితో నామినేషన్లు స్వీకరణ ముగియనుంది. ఫిబ్రవరి 27న ఎన్నికల జరగనున్నాయి. మార్చిన 3న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై సీరియస్గానే దృష్టి పెట్టాయి. ఇక, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ

నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయూఎస్ సంఘాల మధ్య పోటీ వాడివేడిగా సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నిస్తుండగా, ఈ సారైనా గెలిచి కోల్పోయిన స్థానాన్ని నిలబెట్టుకోవాలని పీఆర్డీయూ పావులు కదుపుతోంది. మరో వైపు ఎలాగైనా బోణీ కొట్టాలన్న లక్ష్యంతో టీపీయూఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. మార్చి నెల 29వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికను నిర్వహిస్తోంది. నల్లగొండ కలెక్టరేట్లోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 11న స్క్రూట్నీ, 13వ తేదీన ఉపసంహరణ, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. కాగా, ఇప్పటి వరకు 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక, ఈ ఎన్నికకు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 12 జిల్లాల్లో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 24,905 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా నల్లగొండలోనే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక..
ప్రస్తుత ఎన్నికల్లో యూటీఎఫ్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పీఆర్డీయూ తరఫున శ్రీపాల్ రెడ్డితోపాటు ఒకప్పుడు కీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘమైన టీపీయూఎస్ నుండి సరోత్తమ్ రెడ్డి, ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. గత ఎన్నికల్లో పీఆర్టీయూ నుండి పోటీ చేసిన పూల రవీందర్ కు వ్యతిరేకంగా సరోత్తమ్ రెడ్డి బరిలో ఉండడంతో ఓట్లు చీలి పరోక్షంగా యూటీఎఫ్ విజయానికి దోహదపడింది. గత ఎన్నికల్లో బీసీ, ఓసీ నినాదం బలంగా పని చేయడంతో ఓటర్లు రెండు వర్గాలుగా చీలి పోయారు. దీనికి తోడు అప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన రవీందర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం వివాదాస్పదమైంది. తర్వాత రవీందర్ రెండోసారి పీఆర్టీయూ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేయగా ఓటమి పాలయ్యారు.
పీఆర్టీయూ చీలిక లాభం ఎవరికి…?
ప్రస్తుత ఎన్నికల్లో పీఆర్డీయూ తరఫున శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీ నినాదాన్ని భుజానికెత్తు కున్నారు. జాక్టో మద్దతు ఇస్తున్న రవీందర్ కు కొన్ని బీసీసంఘాలు మద్దతు ప్రకటించాయి. బిజెపి మద్దతుతో బరిలో దిగిన సరోత్తమ్ రెడ్డి.. టీపీయూఎస్ తోపాటు పీఆర్డీయూ ఓటర్లు తన వైపే ఉన్నారని చెబుతున్నారు. టీచర్లలో ఉన్న ప్రధాని మోదీ చరిష్మా తన గెలుపుకు దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి లు కూడా గెలుపు పై ధీమాతో ఉన్నారు. ఈ నలుగురు అభ్యర్థులు గతంలో పీఆర్టీయూలో కీలకంగా వ్యవహరించారు. పీఆర్టీయూలో ఏర్పడిన చీలిక ఎవరికి కలిస్తోందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు యూటిఎఫ్ ప్రయత్నం..
సిట్టింగ్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి మరోసారి యూటిఎఫ్ తరఫున బరిలో దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందకు యూటీఎఫ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. గత ఆరేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్సీ కోటా కింద వచ్చిన రూ.9 కోట్ల నిధుల్లో 96 శాతాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులకల్పనకే ఖర్చు చేశారు. ఎమ్మెల్సీగా తనకు వచ్చిన అలవెన్స్, వేతనాన్ని కూడా సంఘానికే డిపాజిట్ చేశానని, కేవలం పెన్షన్ తోనే ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా సేవ చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. పీఆర్టీయూలో పని చేసిన నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో పరిస్థితులు తనకే అనుకూలంగా ఉంటాయనే ధీమాతో ఆయన ఉన్నారు. ప్రత్యేక బృందాలను నియమించి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. టీపీటీఎఫ్ సహా లెక్చరర్లు, ప్రొపెసర్లు, గురుకులాల మద్దతును ఆయన కూడగడుతున్నారు.
అందరి నినాదం ఒక్కటే..
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఒకే నినాదంతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. సీపీఎస్ రద్దు, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు, టీచర్ లందరికీ హెల్త్ కార్డులు, విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తామని హామీలు ఇస్తున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డీఏల విడుదలకు చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు నెల రోజులు కూడా లేకపోవడంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. పగటి పూట ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్న క్యాండిడేట్లు, రాత్రి వేళల్లో దావత్, విందు భోజనాలతో మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.
గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆసక్తికరంగా మారిన ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..