Video: ఇంటి పక్కన బావి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా ఊహించని సీన్..
ప్రాణం కంటే మిన్నగా పెంచుకున్న పెంపుడు జంతువు ఆపదలో ఉంటే ఆ యజమాని మనసు విలవిల్లాడిపోయింది. బావిలో పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన పిల్లిని కాపాడమంటూ ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి ఆ మూగజీవాన్ని మృత్యువు నుండి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.

ఓ పిల్లి కోసం ఓ యజమాని ఏకంగా పోలీసుల సాయం కోరాడు. ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న తన పిల్లిని కాపాడాలంటూ అధికారులను వేడుకున్నాడు. చివరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రంగం లోకి దిగడంతో ఆ పిల్లి క్షేమంగా ప్రాణాలతో బయట పడింది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. మంచిర్యాల పట్టణంలోని మేదరివాడలో ఓ పిల్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. పిల్లి అరుపులు విన్న యజమాని బావి వద్దకు వెళ్లి పిల్లిని రక్షించే ప్రయత్నం చేశాడు. బకెట్ సాయంతో ఆ పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ పిల్లిని కాపాడటం తన వల్ల కాలేదు. చేసేది లేక బావిలో పడిపోయిన తన పిల్లిని కాపాడాలంటూ పోలీసుల సాయం కోరాడు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ తెలుపడంతో ఫైర్ స్టేషన్కి సమాచారం ఇచ్చాడు.
ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఆ పిల్లిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. నిచ్చెన సాయంతో బావి లోపలికి దిగి ఎట్టకేలకు ఆ పిల్లిని బయటకు తీశారు. ఫైర్ ఆఫీసర్ రమేష్ బాబు నేతృత్వంలోని ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. భగవంతు అనే వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లిని ప్రాణాలతో కాపాడారు. తన పిల్లి సురక్షితంగా బయటకు రావడంతో యజమాని భగవంతు ఉబ్బి తబ్బిబయ్యాడు. మూగ జీవాన్ని కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తులనే కాదు ముగా జీవాలను సైతం రక్షించడమే విధిగా ముందుకు సాగుతున్న ఫైర్ డిపార్ట్మెంట్పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
అయితే బావిలో పడ్డ మూగజీవాలను రక్షించేందుకు సామాన్యులు సాహసాలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పాడు పడ్డ బావుల్లో అయితే అసలు దిగవద్దన్నారు. గతంలో ఇలాగే అహ్మద్నగర్లో ఉన్న ఓ బావిలో ఓ పిల్లి పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. ఆరుగురు వ్యక్తులు నడుముకు తాడు కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దిగారు. అయితే విషవాయులు వెలువడ తో అందులోకి దిగిన ఐదుగురు స్పాట్లోనే మరణించారు. అంతేకాకుండా మూగజీవాలు ప్రమాదంలో పడిన సమయంలో భయంలో ఉంటాయని.. దాడులు చేసే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
