వామ్మో..! నేలరాలుతున్న వందలాది గబ్బిలాలు.. భయంతో వణికిపోతున్న జనం..!
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జీవకోటిని అతలాకుతలం చేస్తున్నాయి. అడవులు ఎండిపోవడం, నీటి వనరులు అడుగంటడంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో వందలాది గబ్బిలాలు, పక్షులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జీవకోటిని అతలాకుతలం చేస్తున్నాయి. అడవులు ఎండిపోవడం, నీటి వనరులు అడుగంటడంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో వందలాది గబ్బిలాలు, పక్షులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిర్వంచ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గబ్బిలాల చావులు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో గబ్బిలాలు కుప్పలు తెప్పలుగా నేలకొరుగుతున్నాయి. కోర్టు ప్రాంగణం, అటవీశాఖ విశ్రాంతి భవనం ఆవరణలోని చింతచెట్లపై నివాసం ఉండే సుమారు 400కు పైగా గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడం, దానికి తోడు తీవ్రమైన వడగాలులు వీచడంతోనే ఈ మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు అటవీశాఖ అధికారులు, నిపుణులు నిర్ధారించారు. ఎండ తీవ్రతకు అడవిలో నీరు లభించకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. చనిపోయిన గబ్బిలాల వల్ల ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో జనం ఏదైనా కొత్త వైరస్ ప్రబలుతుందేమోనన్న భయాందోళనలో ఉన్నారు.
మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎండల ప్రభావం పక్షులపై తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పక్షులు దాహంతో అల్లాడిపోతున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంపై ఒక కాకి దాహంతో పైపు వద్ద నీటి కోసం తపించడం, మరో పక్షి ఎండ వేడికి సొమ్మసిల్లి చనిపోవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పశుపక్షాదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తమ ఇంటి డాబాలపై, కిటికీల వద్ద, ఆవరణల్లో చిన్న చిన్న మట్టి పాత్రల్లో నీటిని, కాస్త ధాన్యపు గింజలను ఉంచితే ఈ మూగజీవుల దాహం తీరి, ప్రాణాలు నిలబడతాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడే పక్షులను రక్షించుకోవడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
