AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేఆర్ఎంబీ ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం.. రెండు రాష్ట్రాల తాగునీటి వినియోగంపై..

కృష్ణా నదీ నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తిపై ఇవాళ కేఆర్‌ఎంబీ ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం నీటికి కేటాయించాలని బోర్డుకు లేఖలు రాయడంతో.. ఈ సమావేశం కీలకంగా మారింది.

కేఆర్ఎంబీ ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం.. రెండు రాష్ట్రాల తాగునీటి వినియోగంపై..
Krmb
Ravi Kiran
|

Updated on: May 05, 2025 | 8:02 AM

Share

తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీల నీటిని ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్. ఈ నెల 31 వరకు నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 17న తెలంగాణ 16.2 టీఎంసీలకు ఇండెంట్ పెట్టగా, ఆ తరువాత ఏపీ కూడా తాగునీటి అవసరాల పేరుతో బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తాగునీటి వినియోగంపై ఇవాళ త్రీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. 2024–25 సంవత్సరంలో ఏపీ ఇప్పటికే తాత్కాలిక కేటాయింపు కంటే అధికంగా నీటిని వినియోగించింది. 66:34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాల్సిన ఉన్నప్పటికీ 72.2 శాతంగా వాడుకుంది. ఏపీ 716.54 టీఎంసీల నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 275.92 టీఎంసీలకే పరిమితమైంది.

ఇప్పటికే వాటా మించిపోయినప్పటికీ, ఏపీ తాజాగా తాగునీటి పేరిట సాగర్ నీటిని ఇవ్వాలని కోరింది. ఇది తెలంగాణకు తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 514 అడుగులు మాత్రమే ఉంది. ఇది డెడ్ స్టోరేజీ స్థాయి 510 అడుగులకు దగ్గరగా ఉంది. ఇప్పుడు వాడుకోగలిగే నీరు కేవలం7 టీఎంసీలే. శ్రీశైలంలో నీటి మట్టం 814 అడుగులకు చేరగా, డెడ్ స్టోరేజీ 834 అడుగులు. ఇక్కడ వాడుకోదగిన నీరు కేవలం 8 టీఎంసీలే. సాగర్, శ్రీశైలం కలిపి ప్రస్తుతం వినియోగించదగిన నీరు 15 టీఎంసీలే. ఇందులోనూ ఆవిరి పోయే నీరు, లాస్ తీసుకున్నా 12 టీఎంసీలకే పరిమితం.

అయితే రెండు రాష్ట్రాల అవసరాలు 26.2 టీఎంసీలుగా ఉండడంతో 14 టీఎంసీల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఏపీ సాగర్ నుంచి నీటిని తరలించితే, తెలంగాణ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. ఇది అదనపు ఖర్చుతోపాటు నష్టం కూడా తలెత్తుతుంది. డెడ్ స్టోరేజీ వద్ద నుంచి నీరు తీసుకెళ్తే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి