
నిజామాబాద్ సభా వేదికగా ప్రధాని మోదీ బీఆర్ఎస్ సర్కార్పై ఘాటైన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల్లో అందించిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ‘మీకో రహస్యాన్ని చెప్పబోతున్నా.. చెప్పమంటారా..? ఇప్పటి వరకు దాన్ని ఎప్పుడు చెప్పలేదు.. ఇప్పుడు చెప్పుతున్నా’.. అంటూ పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు బీజేపీ గెలిచింది. అన్ని సీట్లు మేము గెలుస్తారని వారు ఊహించలేదు. అప్పుడు కేసీఆర్కు సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఎయిర్ పోర్ట్కు వస్తే పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని, గజ మాలలు తీసుకుని స్వాగతం పలికేందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదో తెలుసా..? అంటూ ఇన్నారు ప్రధాని. కేసీఆర్.. నన్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు.. పెద్ద పెద్ద శాలువాలు తెచ్చారు.. అప్పుడు ఎంతో బాగా ఆదరించారు, ఎంతో ప్రేమ చూపించారు. అయితే ఇది కేసీఆర్ క్యారెక్టర్ కాదని నేను అప్పుడే అనుకున్నాని పేర్కొన్నారు.
కేసీఆర్ ఎన్డీఏలో భాగస్వామిగా అవుతామని నాతో చెప్పాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు సహకారం అందించాలని కోరారని ప్రధాని మోదీ అన్నారు. కానీ కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదని.. నేను మీతో జతకట్టబోనని చెప్పినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో విపక్షంలో కూర్చోవాలన్నా కూర్చుంటాం.. కేసీఆర్ సర్కార్ మా కార్యకర్తలపై జులుం చేసినా సహిస్తాం.. కానీ తెలంగాణ ప్రజలను దగా చేయనివ్వమని చెప్పానని ప్రధాని అన్నారు. అలాగే కేసీఆర్ను ఎన్డీఏలో ఎంట్రీకి కూడా నేను నిరాకరించానని చెప్పారు. నేను బీఆర్ఎస్ అవినీతిపై ప్రశ్నించడం ప్రారంభించడంతో అప్పటి నుంచి కేసీఆర్ దూరంగా వెళ్లిపోవడం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కూడా ఒకట్రెండు సార్లు కేసీఆర్ నన్ను కలిశారని.. ఇక నేను తప్పుకోవాలనుకుంటున్నా.. నా కొడుకు కేటీఆర్కు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నానని నాతో చెప్పారు. కేటీఆర్ను మీ వద్దకు పంపిస్తాను.. మీరు ఆశీర్వదించాలని నన్ను కోరారు. ఇది ఆయనే నాతో స్వయంగా చెప్పారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను నువ్వేమైనా రాజువా.. మహరాజువా.. నీ తర్వాత నీ కొడుకు కూర్చోవడానికి.. అని ప్రశ్నించానని ప్రధాని మోదీ అన్నారు. ఎవరిని కూర్చోబెట్టాలా అని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారని.. చెప్పినప్పటి నుంచి కేసీఆర్ నన్ను కలవడం లేదని ప్రధాని తెలిపారు. కనీసం నా కళ్లలోకి చూసే కూడా సాహసం చేయడం లేదని.. మీడియా వాళ్లు కూడా తేదీలు చెక్ చేసుకోవచ్చని ప్రధాని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..