AP-TG Weather: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు వర్ష సూచనలు జారీ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది.. నిన్న పశ్చిమ విదర్భ – దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్పై ఉన్న వాయుగుండం మరింత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, ఈరోజు (01 ఆగస్టు 2026) ఉదయం 05:30 గంటలకు ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలో స్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low Pressure Area) బలహీనపడింది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ద్రోణి సగటు సముద్రమట్టం వద్ద ప్రస్తుతం జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న స్పష్టమైన అల్పపీడన కేంద్రం, సిద్ధి, దేహ్రీ, మాల్దా మీదుగా తూర్పు దిశగా మణిపూర్ వరకు విస్తరించి ఉంది.
రాబోయే 3 రోజుల వాతావరణ ముందస్తు అంచనా (FORECAST)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాగల మూడు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హెచ్చరికలు / సూచనలు (WARNINGS / ADVISORY)
రాగల మూడు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం (02-08-26) విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం , ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది.
గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక :
గోదావరి వరదల తీవ్రత పెరుగుతున్నందున ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు #APSDMA తెలియజేసింది. ప్రస్తుతం, భద్రాచలం వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరుకుంది. వరద తీవ్రత దృష్ట్యా లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఉప్పొంగుతున్న వాగులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
