Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. ఆ మూడు స్టేషన్లు మూసివేత.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?
బీజేపీ విజయ సంకల్ప సభకు అగ్రనేతలంతా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కూడా ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.
BJP Vijaya Sankalpa Sabha: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభ జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు అగ్రనేతలంతా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కూడా ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 వరకు పారడైస్, పరెడ్ గ్రౌండ్, JBS మెట్రో స్టేషన్స్ మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మూడు స్టేషన్స్లో మెట్రో ట్రైన్స్ ఆగకుండా వెళ్తాయని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. మోడీ సభ నేపథ్యంలో భద్రతా కారణాలతో దృష్ట్యా మూసివేస్తున్నట్లు తెలిపింది. మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యథాతధంగా నడుస్తాయంటూ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులు దీనిని గమనించి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థించారు.
ఇదిలాఉంటే.. పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభకు పోలీసులు మీడియాకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రావాలని పోలీసులు మీడియా ప్రతినిధులకు సూచించారు. గేట్ నంబర్ 2 వద్ద మీడియా ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. విజయ సంకల్ప సభ కోసం పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్ టెంట్లు వేశారు. 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. నాయకుల ప్రసంగాలు కనపడేలా 30 ఎల్ఈడీ స్క్రీన్లను అమరుస్తున్నారు.
దీంతోపాటు 100 ఏసీలు, కరెంట్ సప్లయ్ కోసం 50 జనరేటర్లను, నిఘా కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కోసం కంటోన్మెంట్ బోర్డు జింఖానా మైదానం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, బైసన్ పోలో, మడ్ఫోర్ట్లోని హాకీ మైదానంతో పాటు జేబీఎస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..