Telangana: ప్రగతి భవన్ లోనే నలుగురు ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం..

|

Oct 27, 2022 | 8:27 AM

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన టీఆర్ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింంది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి,..

Telangana: ప్రగతి భవన్ లోనే నలుగురు ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం..
CM KCR
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన టీఆర్ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింంది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారాన్ని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తీసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోని దిగనున్నారు. ప్రగతి భవన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి, ఇవాళ (గురువారం) ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఅర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, బీజేపీ నేతలు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్‌లో, హోటల్‌లో, ప్రగతి భవన్‌లో వారం రోజుల సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమేలేదని ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..