Telangana Assembly Sessions Live Updates: తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదు.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌

| Edited By: Subhash Goud

Updated on: Mar 26, 2021 | 5:24 PM

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు చివరి రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శుక్రవారం శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా..

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదు.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌
Kcr About Lockdown

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని వార్తలు వస్తోన్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని… ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టమని తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని…ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు. కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందన్నారు. పరిశ్రమల మూతవేత ఉండదని స్పష్టం చేశారు. తక్కువ మంది అతిథుల మధ్యే శుభకార్యాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ డోసుల్లో మనవాటా మనకు వస్తుందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా టెస్ట్‌లు చేసినట్లు చెప్పుకొచ్చారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2021 03:24 PM (IST)

    జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలకు గుడ్‌న్యూస్‌

    రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. సెక్రెటరీల పట్ల మరోసారి గొప్పమనసును చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్‌ నుంచే రెగ్యులర్‌ జీతాలు ఇస్తామని స్పష్టం చేశారు.

  • 26 Mar 2021 03:03 PM (IST)

    బడ్జెట్‌లో ఆర్టీసీకి 3000 కోట్లు కేటాయించాం

    బడ్జెట్‌లో ఆర్టీసీకి 3000 కోట్లు కేటాయించామని, ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, వారికి త్వరలోనే జీతాలను పెంచుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచినట్లే ఆర్టీసీ ఉద్యోగులకు పెంచుతామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు.

  • 26 Mar 2021 03:01 PM (IST)

    ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త

    తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఉదారస్వభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచి రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని సభలో స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

  • 26 Mar 2021 02:55 PM (IST)

    కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత నిరుద్యోగ భృతి

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సంక్షేమంలో నెంబర్‌ వన్‌గా ఉన్నామన్నారు.

  • 26 Mar 2021 02:52 PM (IST)

    తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇస్తాం - కేసీఆర్‌

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు.

  • 26 Mar 2021 01:57 PM (IST)

    తక్కువ అప్పులు తీసుకుంటోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: సీఎం కేసీఆర్‌

    అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తోన్న కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అప్పుల విషయంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలను కావాలనే గందరగోళానికి గురి చేస్తున్నాయని కేసీఆర్‌ విమర్శించారు. ఈ సందర్బంగా రాష్ట్రం తీసుకుంటోన్న అప్పులు గురించి ఆయన మాట్లాడుతూ.. అప్పులు తీసుకునే జాబితాలో దేశంలో మనం 25వ స్థానంలో ఉన్నామని చెప్పారు. రాష్ట్రం తెచ్చే అప్పులు ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటుందన్న ముఖ్యమంత్రి తెలంగాణ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో తక్కువ అప్పులు తీసుకుంటోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేశారు.

  • 26 Mar 2021 01:47 PM (IST)

    అసెంబ్లీలో కరోనా అప్‌డేట్స్‌..

    అసెంబ్లీలో మాట్లాడుతోన్న సీఎం కేసీఆర్‌ కరోనా నియంత్రణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతోన్న చర్యలపై మాట్లాడారు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు.. * కరోనా కట్టడిలో తెలంగాణ బెస్ట్‌. * దేశంలోనే అత్యధిక పరీక్షలు చేశాం. * బాధతోనే స్కూల్స్‌ బంద్‌ చేశాం. * ప్రజలు ఆందోళన చెందొద్దు, తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు. * స్వీయ క్రమశిక్షణతో కరోనాను నియంత్రించవచ్చు.

  • 26 Mar 2021 01:41 PM (IST)

    తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదు: ముఖ్యమంతి స్పష్టీకరణ

    అసెంబ్లీలో మాట్లాడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా, లాక్‌డౌన్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌పై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోమని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు. స్కూళ్ల మూతివేత తాత్కాలికమేనని ఆయన అన్నారు.

  • 26 Mar 2021 01:36 PM (IST)

    సభలో మాట్లాడుతోన్న సీఎం కేసీఆర్‌..

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్స్‌లో భాగంగా జరుగుతోన్న చివరి తేదీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ సభ్యులకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలతీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు మూసధోరణిలో ఉన్నాయి, చెప్పిందే చెబుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులు, బాధ్యతలను కేంద్రం హరిస్తోందని చెప్పుకొచ్చారు.

  • 26 Mar 2021 01:29 PM (IST)

    సభలో మాట్లాడుతోన్న సీఎం కేసీఆర్‌..

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్స్‌లో భాగంగా జరుగుతోన్న చివరి రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ సభ్యులకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలతీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం లేదని విమర్శించారు.

  • 26 Mar 2021 12:00 PM (IST)

    పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే: హరీష్‌ రావు

    గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. పాలమూరు జిల్లాను ఆకుపచ్చ అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా పాల‌మూరు సాగునీటి ప్రాజెక్టుల‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు మంత్రి హ‌రీష్ రావు పై విధంగా సమాధానమిచ్చారు. కోయిల్‌సాగ‌ర్‌, క‌ల్వకుర్తి, బీమా, నెట్టెంపాడుల‌ను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామ‌ని తెలిపారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను యుద్ధ‌ప్ర‌తిపాదిక‌న పూర్తి చేసి స‌స్యశ్యామ‌లంగా మారుస్తామ‌ని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

  • 26 Mar 2021 11:14 AM (IST)

    మత్స్యకారుల కోసం సీఎం కేసీఆర్‌ నీలి విప్లవం తీసుకొచ్చారు: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

    సమైక్య రాష్ట్రంలో మత్స్యకారులను గుర్తించలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ మత్య్సకారులను గుర్తించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా చేప పిల్లల పంపిణీ, మ‌త్స్యకారుల అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు ప‌శుసంవ‌ర్ధక‌, మ‌త్స్య శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌మాధానం ఇచ్చారు. కుల‌వృత్తుల మీద ఆధార‌ప‌డ్డ వారి అభివృద్ధికి సీఎం చ‌ర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చిన మంత్రి.. ఈ క్రమంలోనే సీఎం నీలి విప్లవం తీసుకొచ్చారన్నారు.

  • 26 Mar 2021 11:05 AM (IST)

    మసీద్‌, చర్చి, గుడికి ఒకేసారి శంకుస్థాపన చేస్తాం: మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.

    కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంలో భాగంగా కూల్చేసిన మసీదు స్థానంలో కొత్త మసీదు నిర్మాణంపై ఎంఐఎం స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. సెక్రటేరియ‌ట్‌లో పాత మ‌సీదు స్థానంలో కొత్త మ‌సీదు క‌డుతామ‌ని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప‌లుమార్లు చెప్పారు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేద‌న్నారు. గ‌తంలో 433 గ‌జాల్లో మ‌సీదు ఉండే.. దాన్ని ప్రస్తుతం 1500 గ‌జాల స్థలంలో నిర్మిస్తామ‌న్నారు. టెంపుల్‌కు 1500 గ‌జాలు, చ‌ర్చికి 500 గ‌జాలు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఈ మూడింటింకి ఒకేసారి శంకుస్థాప‌న చేస్తామ‌న్నారు. సెక్రటేరియ‌ట్ బిల్డింగ్ పూర్తికాక‌ముందే.. వీటిని నిర్మించి అందుబాటులోకి తెస్తామ‌న్నారు. మ‌సీదు విష‌యంలో మ‌రోసారి స‌మావేశ‌మై ప్లాన్‌పై నిర్ణయం తీసుకుంటాం, రంజాన్ కంటే ముందే నిర్మాణం చేప‌డుతాం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • 26 Mar 2021 10:50 AM (IST)

    రాష్ట్రవ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేశాం: మంత్రి శ్రీనివాస గౌడ్‌

    తెలంగాణ వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమాధానం ఇచ్చారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా ఎకో టూరిజంపై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చారు. సోమ‌శిల రిజ‌ర్వాయ‌ర్‌, సింగోటం రిజ‌ర్వాయ‌ర్‌, అక్కమహాదేవి గుహాలు, ఈగ‌ల‌పెంట‌, మ‌న్ననూరు, మ‌ల్లెల‌ తీర్థం, ఉమామ‌హేశ్వరం, ల‌క్నవ‌రం, మేడారం, తాడ్వాయి, పాకాల‌, ఆలీసాగ‌ర్ వ‌ద్ద ఎకో పార్కుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స‌మీపంలో 2,097 ఎక‌రాల్లో కేసీఆర్ ఎకో పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. గ‌తంలో టూరిజం స్పాట్‌ల‌ను వ్యాపార కేంద్రాలుగా మార్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. టూరిజం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.

  • 26 Mar 2021 10:18 AM (IST)

    వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఉభయసభలు..

    చివరి రోజు జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో.. మాజీ ఎమ్మె‌ల్యేలు, ఎమ్మె‌ల్సీ‌లకు సంబం‌ధిం‌చిన బిల్లు, ప్రభుత్వ ఉద్యో‌గుల రిటై‌ర్‌‌మెంట్‌ పరి‌మి‌తిని 61 సంవ‌త్సరా‌లకు పెంచే బిల్లు‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. అనం‌తరం ద్రవ్య విని‌మయ బిల్లుపై ప్రభుత్వం చర్చిస్తారు. ఉభయసభలు వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నాయి. ఆ తరు‌వాత శాసనమండలి, శాసనసభ నిర‌వ‌ధి‌కంగా వాయిదా పడ‌ను‌న్నాయి.

Published On - Mar 26,2021 3:33 PM

Follow us