Hyderabad: మార్ఫింగ్ ఫోటోల పేరుతో బెదిరింపులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్!
వ్యక్తి గత కక్ష్యతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో సాయి సుధాకర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

గతంలో తనను జైలుకు పంపించారనే కోపంతో ఓ వ్యక్తి మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్ల క్రితం మంచాల సాయిసుధాకర్ అనే బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలోని ఉన్న మేరీ సువర్ణభూమి రిసార్ట్స్లో డైరెక్టర్గా పనిచేసేవాడు. అయితే ఇతను సంస్థలో డైరెక్టర్గా ఉంటూ అనేక రకాల మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. సాయిసుధాకర్పై సంస్థ నిర్వాహకులు చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపారు.
ఇక కొన్నాళ్ల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన సాయిసుధాకర్ తనను జైలుకు పంపించిన సంస్థపై ఎలాగైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇక ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నాడు. ఇందులో భాగంగానే మార్ఫింగ్ ఫోటోలతో ఆ సంస్థ డైరెక్టర్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే తనకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక సాయిసుధాకర్ బెదిరింపులతో విసిగిపోయిన ఆ సంస్థ డైరెక్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో సంస్థ తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని..లేకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో సాయి సుధాకర్పై బీఎన్ఎస్ 336(4), 79, 351(2), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..