Hyderabad: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవ దహనం
ఇటీవల జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు నగర వాసులను హడలెత్తిస్తున్నాయి. అధికారులు ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకున్న ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా కింగ్ కోఠీలో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఇటీవల జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు నగర వాసులను హడలెత్తిస్తున్నాయి. అధికారులు ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకున్న ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా కింగ్ కోఠీలో అగ్ని ప్రమాదం సంభవించింది. బొగ్గుల కుంట మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగడంతో కారులో నిద్రపోయిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాఆడు. మృతుడు సెక్యూరిటీ గార్డు సంతోష్గా గుర్తించారు. మంటల్లో మొత్తం ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. కాగా భారీ శబ్ధాలతో పేలుళ్లు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలార్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారులు తెలుసుకుంటున్నారు. కాగా కింగ్ కోఠి ప్రమాదంలో మృతుడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాత్రి డ్యూటీకి వచ్చిన తమ బిడ్డ ఉదయానికి సజీవదహనం అవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ సంతోష్కి భార్యా, ఇద్దరు బిడ్డలున్నారు. సంఘటనాస్థలానికి వచ్చిన కుటుంబ సభ్యులు.. అక్కడి పరిస్థితిని చూసి బోరున విలపించారు. సంతోష్ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడవడం అక్కడున్నవారిని కదిలించింది.
తమ కొడుకు చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సంతోష్ తల్లిదండ్రులు. పగలు చెప్పుల షాప్ నడిపిస్తాడని.. రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడన్నారు. ఇప్పుడు ఈ కుటుంబానికి దిక్కేదంటూ రోదిస్తున్నారు. రాత్రి పన్నెండున్నరకు కాల్ చేసి రేపు ఇంటికి వస్తానన్నాడని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపించారు తల్లిదండ్రులు. కాగా ఇటీవల సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగి ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు దక్కన్ మాల్లో అగ్నీ కీలలకు ముగ్గురు ఆహుతయ్యారు. ఇలా నగరంలో వరుస అగ్ని ప్రమాదలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




