Hyderabad: ఓల్డ్సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మతపరమైన పాఠాలు బోధిస్తున్నట్టు ఆరోపణలు రావడం నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సదురు స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. రెండో తరగతి విద్యార్థికి మతపరమైన ఖురాన్ పాఠాలను హోమ్ వర్క్గా ఇచ్చాడని బాధిత తల్లిదండ్రులు ఆరోపించడంతో బీజేపీ, ఏబీవీపీ నాయకులు స్కూల్ను ముట్టడించాలని ప్రయత్నించారు.

పాతబస్తీ సైదాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. సదురు స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. రెండో తరగతి విద్యార్థికి కల్మా, సురా ఫతేహా చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇచ్చారు. అదిగమనించిన విద్యార్థి తల్లి స్కూల్కు వెళ్లి టీచర్ను నిలదీశారు. హిందూ పిల్లలకు ఖురాన్ హోంవర్క్ ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్కూల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. హోంవర్క్ ఇచ్చిన టీచర్ను టెర్మినేట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే విద్యార్థి హోమ్వర్క్ సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు స్కూల్ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఉదయం నుంచే స్కూల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. స్కూల్ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్తోపాటు మేనేజ్మెంట్పై కేసులు నమోదు చేయాలన్నారు బీజేపీ నేతలు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు స్పందిస్తూ.. కల్మా హోంవర్క్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఘటనపై స్కూల్ ఎండీ మాట్లాడుతూ.. ఖురాన్ హోం వర్క్ ఇచ్చిన టీచర్ను ఆరోజే టెర్మినేట్ చేశామన్నారు. దీనికి యాజమాన్యంతో సంబంధం లేదని.. టీచర్ తప్పిదమే అంటున్నారు. తమ స్కూల్లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదదని చెప్పుకొచ్చారు. స్కూల్లో 99శాతం మంది స్టూడెంట్స్ ముస్లింలే ఉన్నారని.. వివాదం తర్వాత విద్యార్థి తండ్రి వచ్చి మాట్లాడారని తెలిపారు. అయితే ఈ వివాదం కాస్త తీవ్రంగా మారడంతో అటు విద్యాశాఖ అధికారులు సైతం స్కూల్లో తనిఖీలు చేపట్టారు.
వీడియో చూడండి,.,
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
