Hyderabad: ముంబై పోలీసులమంటూ సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బు మాయం
ముంబై పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బెదిరించి ఆమెకే తెలియకుండా ఆమె ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు కాజేశారు. హైదరాబాద్లోని మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్ వెంగళరావునగర్ డివిజన్లో నివాసముండే పులుగుర్తి షెఫాలి (25)కి మార్చి 21న ఫెడెక్స్ కొరియర్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. తమను తాము నార్కోటిక్స్ బ్యూరో పోలీసులమని పరిచయం చేసుకున్నారు..
హైదరాబాద్, మార్చి 25: ముంబై పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బెదిరించి ఆమెకే తెలియకుండా ఆమె ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు కాజేశారు. హైదరాబాద్లోని మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్ వెంగళరావునగర్ డివిజన్లో నివాసముండే పులుగుర్తి షెఫాలి (25)కి మార్చి 21న ఫెడెక్స్ కొరియర్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. తమను తాము నార్కోటిక్స్ బ్యూరో పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ముంబై నుంచి ఇరాన్కు ఆమె ఆధార్ కార్డు, ఫోన్ నంబర్పై ప్యాకేజి బుక్ అయిందని చెప్పారు. ఆ ప్యాకేజీలో 50 ఎల్ఎస్డి స్ట్రిప్స్, ఇతర డ్రగ్స్కు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పారు. దీంతో భయపడిపోయిన షెఫాలి తాను హైదరాబాద్లో ఉంటానని, ఆ ప్యాకేజి తాను పంపలేదని చెప్పింది. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో ముంబై పోలీసులకు కాల్ బదిలీ చేస్తున్నట్లు చెప్పి మరో వ్యక్తికి కాల్ను బదిలీ చేశారు. ఆ వ్యక్తి ముంబై నార్కోటిక్స్ పోలీసులమని తనను తాను పరిచయం చేసుకుని ఆమెను విచారించాల్సి ఉందని, ఆమె ఫోన్లో స్కైప్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
ఆ ప్రకారంగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీడియో కాల్లో పోలీసు యూనిఫామ్లో ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. వెనుక ఉన్న బ్యాక గ్రౌండ్ కూడా పోలీసు స్టేషన్ మాదిరిగానే కనిపించడంతో బాధితురాలు వారిని నిజమైన పోలీసులుగానే భావించింది. అనంతరం ఆమె ఆధార్ కార్డ్ చూపించాలని అతను అడిగాడు. అనంతరం ఆమె ఆధార్ కార్డ్ వివిధ టెర్రరిస్టుల ఖాతాలకు లింక్ చేసి ఉందని చెప్పి ఆమెను భయబ్రాంతులకు గురి చేశాడు. అలా దాదాపు 3 గంటల పాటు ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించారు. ఆమె బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవ్వాలని సైబర్ మోసగాళ్లు బెదిరించి, ఆమె ఫోన్ స్క్రీన్ షేరింగ్ తీసుకున్నారు. ఇన్స్టా పర్సనల్ యాప్ ద్వారా ఆమెకు తెలియకుండా రూ.3,40,000 తీసుకున్నారు. ఆమె అకౌంట్కు రూ.3,40,000 పంపుతున్నామని, ఆ డబ్బును విడతల వారీగా తిరిగి తాము సూచించిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు.
వారు చెప్పినట్లే తొలుత రూ.98 వేలు బదిలీ చేసింది. ఆ తర్వాత లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించగా, చెల్లింపు నిలిచిపోయింది. అదే విషయం సైబర్ నేరగాడికి చెబితే.. తన స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని పంపాలని బెదిరించారు. ఇంతలో ఆమెకు అనుమానం వచ్చి కాల్ కట్ చేసింది. తన అకౌంట్ను చెక్ చేసుకోగా ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.3,40,000 తీసుకున్నారని, వాటినే వారికి పంపుతున్నట్లు గ్రహించింది. వెంటనే మధురానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.