Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 40 గంటలపాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నివసించే వారికి జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. మంజీరా పైప్లైన్ మరమ్మత్తుల కారణంగా వరుసగా రెండు రోజుల పాటు అంటే సుమారు 40 గంటల పాటు మీ నల్లాలు మూతపడనున్నాయి. మరమ్మత్తులు ఎందుకు చేస్తున్నారు? ఏయే కాలనీలపై ఈ ప్రభావం పడనుంది? మళ్లీ నీళ్లు ఎప్పుడు వస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్లోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి ముఖ్య విషయం తెలిపింది. మంజీరా ఫేజ్-2 లో ఏర్పడిన భారీ లీకేజీల కారణంగా నగరంలోని కీలక ప్రాంతాల్లో దాదాపు 40 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-2 సరఫరా లైన్లో భాగంగా కలబ్గూర్ నుంచి పటాన్చెరు మీదుగా హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీమెయిన్ పైపులైన్కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీల వల్ల భారీగా నీరు వృధా అవుతుండటంతో జలమండలి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని నిర్ణయించింది.
అంతరాయం కలిగే సమయం – ప్రాంతాలు
11.02.2026 బుధవారం ఉదయం 6 గంటల నుండి. 12.02.2026 రాత్రి 10 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది.
మరమ్మత్తుల కారణంగా ఈ డివిజన్ల పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది.
- ఓ అండ్ ఎం డివిజన్ 17 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్.
- ఓ అండ్ ఎం డివిజన్ 22: బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.
- ఓ అండ్ ఎం డివిజన్ 9 : కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్.
- ఓ అండ్ ఎం డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్పేట్.
- ట్రాన్స్ మిషన్ డివిజన్ 2: ట్రాన్స్మిషన్ డివిజన్ 2 పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.
అధికారుల సూచనలు
దాదాపు రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుండటంతో జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. నీటి సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న మియాపూర్, కూకట్పల్లి వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ముందస్తుగా సిద్ధంగా ఉండటం మంచిది.




