Hyderabad Biryani: బిర్యానీ రాజధానిగా మరోసారి హైదరాబాద్.. 2025లో రికార్డులు బద్దలు కొడుతూ..
బిర్యానీ అంటే హైదరాబాద్… హైదరాబాద్ అంటే బిర్యానీ… ఈ మాట మరోసారి అక్షరాలా నిజమైంది. 2025లో స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు ఇచ్చిన నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. చికెన్ బిర్యానీ నుంచి దోస, ఇడ్లీ, తీపి వంటకాల వరకు… నగర రుచుల వైవిధ్యం సంఖ్యల్లోనే కాదు, అలవాట్లలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్.. ఈ మాటను మరోసారి నిజం చేస్తూ, 2025లోనూ దేశవ్యాప్తంగా ‘బిర్యానీ క్యాపిటల్’గా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ విడుదల చేసిన 2025 రిపోర్ట్ ప్రకారం, హైదరాబాద్ నుంచి ఒక్క ఏడాదిలోనే 1.75 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. నగర ప్రజలకు బిర్యానీపై ఉన్న లవ్కు ఇదే నిదర్శనం. ఇందులోనూ చికెన్ బిర్యానీదే పైచేయి. మొత్తం ఆర్డర్లలో 1.08 కోట్ల ఆర్డర్లు (61 శాతం) చికెన్ బిర్యానీనే కావడం విశేషం. బిర్యానీతో పాటు హైదరాబాద్ ప్రజల కంఫర్ట్ ఫుడ్ అభిరుచి కూడా స్విగ్గీ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. దోసలకు సంబంధించి.. 39.9 లక్షల ఆర్డర్లు రాగా.. ఇడ్లీ కోసం 34 లక్షల ఆర్డర్లు వచ్చాడు. ఈ మూడు కలిసి నగరంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన టాప్ డిష్లుగా నిలిచాయి.
హైదరాబాద్ వాసులకు తీపి మీద ప్రేమ ఎంతటిదో కూడా ఈ రిపోర్ట్ చెబుతోంది. బూందీ లడ్డూ కోసం 3.3 లక్షల ఆర్డర్లు వచ్చాయి. చాక్లెట్ కేక్, గులాబ్ జామూన్ ఆ తర్వాత ప్లేసుల్లో నిలిచాయి. పండుగలైనా, సాధారణ రోజులైనా.. తీపి లేకుండా హైదరాబాద్ జీవితం ఊహించలేనిదే అన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. సాయంత్రం వేళ చిరుతిళ్ల విషయానికి వస్తే నాన్వెజ్కే ఎక్కువ డిమాండ్ కనిపించింది. చికెన్ బర్గర్ కోసం 2025లో 6.8 లక్షల ఆర్డర్లు వచ్చాయి. తర్వాత స్థానాల్లో చికెన్ ఫ్రై, చికెన్ షవర్మా ఉన్నాయి. వీటితో పాటు వెజ్ పిజ్జాలు, వెజిటేరియన్ పఫ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. బిర్యానీ, బర్గర్లతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వర్గం కూడా స్విగ్గీలో బిజీగానే ఉంది. హై-ప్రోటీన్ ఆహార ఆర్డర్లలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 22.13 లక్షల హై-ప్రోటీన్ ఆర్డర్లు నమోదయ్యాయి.
ఎగిరే కార్లు రాకపోయినా.. ఇప్పుడు హైదరాబాద్లో మూడు నిమిషాల్లో చికెన్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ డోర్ డెలివరీ సాధ్యమవుతోంది. 2025లో నమోదైన ఇదే స్విగ్గీ అత్యంత వేగవంతమైన డెలివరీగా రికార్డుకెక్కింది. ఈ సౌకర్యాల వెనుక డెలివరీ పార్ట్నర్ల కృషి అపారం అని స్వీగ్గీ తెలిపింది. పార్టీల విషయంలోనూ హైదరాబాద్ వెనకడుగు వేయదు. ఒకే ఆర్డర్లో ఓ కస్టమర్.. 10 అపోలో ఫిష్, 11 మస్రూమ్ వేపుడు, 13 కాజు కోడి రోస్ట్, 42 ప్లేట్స్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది
స్విగ్గీ డైన్అవుట్ ద్వారా హైదరాబాద్ ప్రజలు మొత్తం రూ.114.8 కోట్ల వరకు ఆదా చేశారు.. ఇందులో ఒకే బుకింగ్లో రూ.1,17,905 సేవ్ చేసిన వినియోగదారుడు ‘టాప్ సేవర్’గా నిలిచాడు. అలాగే, ఆగస్టులో ఒక్క వినియోగదారు 65 డ్రై ఫ్రూట్ కుకీస్ గిఫ్ట్ బాక్సులు ఆర్డర్ చేయగా, దానికిగారే రూ.47,106 ఖర్చు చేశాడు.
మొత్తం మీద.. బిర్యానీతో మొదలై, దోశ నుంచి డ్రై ఫ్రూట్ కుకీస్ వరకూ.. హైదరాబాద్ ఆహార సంస్కృతి ఎంత వైవిధ్యంగా, ఎంత బలంగా ఉందో ఈ స్విగ్గీ గణాంకాలు మరోసారి నిరూపించాయి.
