WhatsApp Services: నగర వాసులకు గుడ్న్యూస్.. త్వరలో వాట్సప్లోనూ ఆస్తిపన్ను చెల్లింపులు.. GHMC భలే ప్లాన్..!
ప్రస్తుత ఆన్లైన్ యుగంలో ఆన్లైన్ సేవలను వినియోగించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే పక్కరాష్ట్రమైన ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలురకాల సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు సైతం కొన్ని పన్నులను చెల్లించేందుకు ప్రజలకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత ఆన్లైన్ యుగంలో ఆన్లైన్ సేవలను వినియోగించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వినియోగాన్ని పౌర సేవలకూ విస్తరించేందుకు హైదరాబాద్ GHMC అధికారులు కీలక ముందడుగు వేశారు. సామాజిక మాధ్యమాల్లో కేవలం సమాచారాన్ని పంచుకోవడమే కాకుండా.. ఇతర పౌర సేవలకు కూడా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇకపై వాట్సప్లోనే ఆస్తిపన్ను(ప్రొపర్టీ ట్యాక్స్), ట్రేడ్ లైసెన్సు ఫీజు లాంటి కీలక రుసుములు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ప్రతి ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల మేర ఆస్తిపన్ను వసూలవుతుండగా.. దాంట్లో సగం వరకు ఆన్లైన్ పేమెంట్స్ రూపంలో వస్తోంది. గూగుల్ పే, మైజీహెచ్ఎంసీ యాప్, పేటీఎం, ఇతర యూపీఐ ప్లాట్ఫామ్లతోపాటు వెబ్సైట్ ద్వారానే ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు. అయితే ప్రతిసారీ పన్ను బకాయిలను గుర్తు చేయడానికి జీహెచ్ఎంసీ సుమారు 20 లక్షల ఎస్ఎంఎస్లు పంపాల్సి వస్తోంది. ఆ మెసేజ్లు పంపేందుకు పెద్ద మొత్తంలో ఖర్చువుతోంది. ప్రతి 1,000 మెసేజ్లకు సగటున రూ.52 ఖర్చవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు, వాట్సప్ బిజినెస్ అకౌంట్ ద్వారా పేమెంట్స్ చేపట్టాలనే యోచనలో ఉంది బల్దియా.
కొన్ని పేమెంట్ గేట్వే సంస్థలు ప్రజలు చెల్లించిన పన్నును తమ అకౌంట్లలో రెండు రోజులపాటు నిలుపుకుంటూ వడ్డీ ఆదాయాన్ని పొందుతున్న నేపథ్యంలో.. వాట్సప్ సేవలను ఫ్రీగా అందించాలని షరతులు విధించనుంది జీహెచ్ఎంసీ. ఈ మార్గం ద్వారా పౌర సేవల సౌలభ్యం పెరుగుతుందని.. ఖర్చు తగ్గుతుందని, నగరవాసులకు మరింత సౌకర్యం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.