Hyderabad: ఘోర ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఐదుగురు దుర్మరణం..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎండీ, డైరెక్టర్ రవికుమార్ (హైదరాబాద్), ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం (36), దయానంద్ (48), సురేష్పాల్ (43), కార్మికుడు విష్ణు (35) గా గుర్తించారు. గాయపడ్డవారికి నిమ్స్, కేర్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కలెక్టర్, ఎస్పీకి సూచించారు రేవంత్. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించారు.
ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్-1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతోపాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు సమాచారం. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేపట్టి కొనసాగిస్తున్నట్టు తెలిసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల వ్యవధిలో..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్, చందాపూర్ ప్రాంతాల్లోని విస్తరించిన పరిశ్రమల్లో నెల రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత రెండేళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయి. 72 మంది కార్మికులు మృత్యువాత పడగా, 225 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమల్లో కర్మాగారాల భద్రతా శాఖ నిరంతర పర్యవేక్షణ ఉండాలి కానీ సిబ్బంది కొరత సాకు చెబుతూ.. ఏడాదికి ఒకసారే పర్యవేక్షిస్తున్నారు. అనుమానం వస్తేనే తాఖీదులు ఇస్తున్నారు. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో లోకల్ క్రైసిస్ బృంద సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకున్న నాథుడే లేరు.
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ మాదిరిగానే ప్రమాదాలు చాలా వరకు రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి. కొత్త ఉత్పత్తులు చేయటం, రసాయనాలు పద్ధతి ప్రకారం కలపకపోవడం, వేగంగా రియాక్టర్లో వేయటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రియాక్టర్ల భద్రతపై ప్రత్యేక విభాగం ఉండాలని నిబంధన ఉన్నా పాటించరు. ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉన్నా ఫలితం ఉండటం లేదు. ఆధునిక పరికరాలను కొనుగోలు చేయటానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. ప్రతి పారిశ్రామిక వాడలో అగ్నిమాపక కేంద్రం ఉండాలని నిబంధన ఉన్నా ఘటన జరిగిన హత్నూర ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాలు లేవు. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లే లోపు నష్టం జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..